Stock Market: ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు.. వడ్డీ రేట్ల పెంపు తరువాత కన్సాలిడేషన్.. ఈ రోజు ఇలా..
Stock Market Opening Bell: గత వారం దేశంలోని సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద షాకే ఇచ్చిందని చెప్పుకోవాలి. అందరూ రేటు పెంపు సుమారు 35 పాయింట్ల వరకు ఉండవచ్చని భావించినప్పటికీ.. ఎంపీసీ మాత్రం 50 పాయింట్ల మేర రేటు పెంచటం ఈ వారం మార్కెట్లపై ప్రభావాన్ని చూపుతోంది. దీనికి తోడు అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగ గణాంకాలు, రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిత ఉత్పత్తి వివరాలతో పాటు.. ఫెడ్ చర్యల కోసం దేశీయ పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాల మధ్య మార్కెట్లు కన్సాలిడేటెడ్ స్టేట్ లో కొనసాగుతున్నాయి.
ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరంభంలో స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే వెంటనే తేరుకుని పాజిటివ్ నోట్ లో కొనసాగుతున్నాయి. దేశీయ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఉదయం 9.45 గంటలకు.. కీలక మార్కెట్ సూచీలైన సెన్సెక్స్ 137 పాయింట్లు, నిఫ్టీ-50.. 36 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 92 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ మాత్రం స్వల్పంగా నష్టాల నుంచి తేరుకుని 13 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది.
మార్కెట్ల ఆరంభంలో నిఫ్టీ-50 సూచీలోని ఎం అండ్ ఎం, ఇండస్ ఇండ్ బ్యాంక్, హిందాల్కో, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, టాటా మోటార్స్, ఎల్ అండ్ టి స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బీపీసీఎల్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, విప్రో, శ్రీ సిమెంట్, ఓఎన్జీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, బ్రిటానియా, టీసీఎస్, టెక్ మహీంద్రా స్టార్స్ ఆరంభంలో నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.