Stock Market: వచ్చే వారం మార్కెట్లో కల్లోలం జరగొచ్చు.. ఇన్వెస్టర్స్ బీకేర్ ఫుల్..!!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో అమెరికా బ్యాంకింగ్ వ్యవస్థ కల్లోలాన్ని సృష్టిస్తోంది. అమెరికా, యూరప్ లలో ఉన్న ఆర్థిక మాంద్యం ఆ దేశాల బ్యాంకులపై ఇప్పుడు ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో గతవారం మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేశాయి.
అయితే ఈ ప్రభావం రానున్న వారం కూడా కొనసాగుతుందా అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్ల మదిలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఫెడ్ ఛైర్మన్ పావెల్ మాట్లాడుతూ రేట్ల పెంపు దూకుడు కొనసాగుతుందని వెల్లడించారు. అయితే ఈ సారి పాలసీలో ఎలాంటి ప్రకటనలు ఉంటాయనే ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్లను ఆవరించాయి.
అమెరికా బ్యాంకింగ్ రంగంలో ఏర్పడిన సంక్షోభం బంగారం ధరలు భారీగా పెరగటం మెుదలైంది. ఇప్పటికే ఇండియాలో బంగారం ధరలు రూ.60 వేల మార్కును దాటాయి. దీనికి తోడు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మానిటరీ పాలసీ సమావేశాలు రానున్న వారం జరగనున్నాయి. ఇప్పటికే క్రెడిట్ సూయిస్ ప్రమాదంలోకి జారుకోవటంతో ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై సెంట్రల్ బ్యాంక్ ఎలాంటి కార్యాచరణను ప్రకటిస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆర్థిక అల్లకల్లోలం నేపథ్యంలో గతవారం సెన్సెక్స్ లోని 22 కంపెనీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఇదే క్రమంలో టీసీఎస్, ఇండస్ ఇండ్ కంపెనీలు యాజమాన్య మార్పుల కారణంగా తీవ్ర ఒత్తిడిలో ట్రేడవుతున్నాయి. ఈ రెండు షేర్ల తర్వాత ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు సైతం భారీగానే గతవారం నష్టపోయాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తంగా ట్రేడింగ్ చేయాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాలో పీపీఐ ద్రవ్యోల్బణం, రిటైల్ అమ్మకాల డేటా నెమ్మదించటం వంటి కారణాల నేపథ్యంలో మార్కెట్లో స్వల్పకాలిక పుల్ బ్యాక్ ఉండవచ్చని మోతీలాల్ ఓస్వాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అన్నారు. భారత మార్కెట్లు ఓవర్ వెయిట్ కావటంతో విదేశీ ఇన్వెస్టర్లు సైతం చౌక మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతూ తమ పెట్టుబడులను మన మార్కెట్ల నుంచి వెనక్కు తీసుకుంటున్నారు.