Stock market: స్టాక్ మార్కెట్ క్రాష్.. ట్రేడర్లు ఈ ఒక్క తప్పు చేస్తే అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం!
పెట్టుబడిదారులకు సోమవారం (మే 18) బ్లాక్ మండేగా మారింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల స్టాక్ మార్కెట్ (stock market) ఒక్కసారిగా కుప్పకూలింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 50 ఇండెక్స్ కూడా 1 శాతం క్షీణించి 27,300 స్థాయికి పడిపోయింది.
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై మూడు నెలలు కావస్తున్నా పశ్చిమ ఆసియాలో శాంతి వచ్చే సూచనలు కనిపించడం లేదు. దీనివల్ల గ్లోబల్ గ్రోత్ దెబ్బతినడమే కాకుండా ద్రవ్యోల్బణం (Inflation) కోరలు చాస్తోంది. ప్రపంచ ఇంధన రవాణాలో 20% వాటా ఉన్న 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మూతపడటంతో ముడిచమురు ధరలు బ్యారెల్కు 100-110 డాలర్ల పైనే కదలాడుతున్నాయి. చమురును భారీగా దిగుమతి చేసుకునే భారత్కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది. దేశంలో హోల్ సేల్ ద్రవ్యోల్బణం (WPI) 42 నెలల గరిష్ట స్థాయి అయిన 8.3% కి చేరింది. రాబోయే రోజుల్లో ఆర్బీఐ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో రూపాయి విలువ డాలర్తో పోలిస్తే రూ. 100 దాటిపోయే ప్రమాదం ఉందని సిస్టమాటిక్స్ ఈక్విటీస్ హెచ్చరించింది.

ఇన్వెస్టర్లు అగ్రెసివ్గా వెళ్లొద్దు: నిపుణుల హెచ్చరిక
గ్లోబల్ పిక్చర్ చాలా గందరగోళంగా ఉన్నందున ఇన్వెస్టర్లు తొందరపడి పెద్ద మొత్తంలో షేర్లు కొనవద్దని విశ్లేషకులు చెప్తున్నారు. కాంతిలాల్ ఛగన్లాల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ ఓఝా మాట్లాడుతూ.. కంపెనీల ఫండమెంటల్స్ బాగున్నప్పటికీ, కేవలం అంతర్జాతీయ అనిశ్చితి వల్లే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి (Selling Pressure) పెరుగుతోందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధంపై తీసుకుంటున్న ఊగిసలాట నిర్ణయాలు, మన ప్రధాని మోదీ పొదుపు మంత్రం పాటించాలని పిలవడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి. అందుకే ఇప్పుడు ఈక్విటీల కంటే డెట్ ఫండ్స్ (Debt) లేదా లిక్విడ్ ఫండ్స్లో క్యాష్ ఎక్కువగా ఉంచుకోవడం మంచిదని, మార్కెట్కు దూరంగా ఉండి గమనించడమే ఉత్తమమని ఆయన సలహా ఇచ్చారు.
SIP ఇన్వెస్టర్లు భయపడాలా?
ఈ స్టాక్ మార్కెట్ (stock market) క్రాష్ చూసి ప్రతి నెల క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు దాచే ఎస్ఐపీ (SIP) ఇన్వెస్టర్లు అస్సలు భయపడాల్సిన అవసరం లేదని మహేష్ ఓఝా స్పష్టం చేశారు. మార్కెట్ పడుతున్నప్పుడు లంప్సమ్ (ఒకేసారి) ఇన్వెస్ట్ చేయడం రిస్క్ కానీ, ఎస్ఐపీ చేసేవారికి రూపాయి కాస్ట్ యావరేజింగ్ (Rupee Cost Averaging) బాగా కలిసి వస్తుంది. అంటే మార్కెట్ పతనం వల్ల తక్కువ ధరకే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ యూనిట్లు మీ అకౌంట్లోకి వస్తాయి. కాబట్టి మీ ఎస్ఐపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్టాప్ చేయకండి. వీలైతే డెట్ ఫండ్స్ కేటాయింపులను కొద్దిగా పెంచుకోండి.
నిఫ్టీకి సపోర్ట్ ఎక్కడ?
రెలిగేర్ బ్రోకింగ్కు చెందిన అజిత్ మిశ్రా ప్రకారం.. స్వల్పకాలిక ఇన్వెస్టర్లు ఒకేసారి పెట్టుబడి పెట్టడం అస్సలు మంచిది కాదు. కనీసం ఏడాది కంటే ఎక్కువ టైమ్ హారిజన్ ఉన్నవారు కేవలం భారతదేశీయ మార్కెట్పై ఆధారపడి నడిచే (Domestic-focused) కంపెనీల షేర్లను కొద్దికొద్దిగా కొనుగోలు చేయవచ్చు. ఇండెక్స్ పరంగా చూస్తే నిఫ్టీకి 23,150 అనేది చాలా కీలకమైన సపోర్ట్ ఏరియా. ఒకవేళ మార్కెట్ ఇంకా పడిపోతే గనుక 22,000 మార్క్ వద్ద మేజర్ సపోర్ట్ ఉంది. కాబట్టి కిందకి పడటానికి ఇంకా స్కోప్ ఉంది, ఇన్వెస్టర్లు అలర్ట్గా ఉండాలి.
ట్రేడర్లు ఈ తప్పు చేయకండి!
ఇక ఇంట్రాడే లేదా షార్ట్ టర్మ్ ట్రేడర్ల విషయానికి వస్తే.. నిఫ్టీ మళ్లీ 24,000 మార్కును దాటి స్థిరపడే వరకు మార్కెట్ ట్రెండ్ నెగెటివ్గానే ఉంటుందని గుర్తుంచుకోవాలి. నిఫ్టీ గనుక 23,150 స్థాయిని కోల్పోతే తదుపరి భారీ పతనం ఖాయం. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రేడర్లు ఓవర్నైట్ పొజిషన్లను (మార్కెట్ ముగిసాక మరుసటి రోజుకి షేర్లను హోల్డ్ చేయడం) క్యారీ చేయకపోవడమే మంచిది. ఒకవేళ పొజిషన్లు ఉంచాలనుకుంటే ఖచ్చితంగా హెడ్జింగ్ (Hedging) చేసుకోవాలని, స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయవద్దని ఎక్స్పర్ట్స్ గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications