Market Crash: 1200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, రూ.17 లక్షల కోట్లు హుష్కాకి
స్టాక్ మార్కెట్ సోమవారం(జనవరి 24) కుప్పకూలింది. గతవారం వరుసగా నాలుగు వారాల్లో 2285 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, నేడు ఒక్కరోజే 1200 పాయింట్ల వరకు పతనమైంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు సూచీలు వెనక్కి వెళ్తుండటం గమనార్హం. అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, మెటల్, ఐటీ, పవర్, ఫార్మా, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, క్యాపిడల్ గూడ్స్ రంగాలు ఒక శాతం నుండి ఐదు శాతం పడిపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 3 శాతం నుండి నాలుగు శాతం పడిపోయాయి.
రూ.17 లక్షల కోట్ల సంపద హుష్ కాకి
నేడు మధ్యాహ్నం గం.12.40 సమయానికి పేటీఎం స్టాక్ నేడు ఏకంగా ఆరు శాతం లేదా రూ.57కు పైగా తగ్గి రూ.902 వద్ద ఉంది. జొమాటో స్టాక్ 18 శాతానికి పైగా క్షీణించి రూ.93 వద్ద ట్రేడ్ అయింది. పేటీఎం, నైకా, జొమాటో 52 వారాల కనిష్టానికి చేరుకున్నాయి. వొడాఫోన్ ఐడియా 5 శాతం పడిపోయింది. హెవీ వెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 2.5 శాతం క్షీణించి రూ.2417 వద్ద ట్రేడ్ అయింది. ఇన్వెస్టర్లు నేడు ఒక్కరోజే రూ.7 లక్షల కోట్ల మేర నష్టపోయారు. వరుసగా అయిదు సెషన్లు నష్టాల్లో ఉండటంతో ఈ ఐదు రోజుల్లో రూ.17 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది.
హెవీ వెయిట్స్ డౌన్
రిలయన్స్, ఇన్ఫోసిస్, HDFC బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, HDFC, ఐసీఐసీఐ బ్యాంకు, ఏషియన్ పేయింట్స్, కొటక్ బ్యాంకు, టెక్ మహీంద్రా, టీసీఎస్, టైటాన్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ వంటి హెవీ వెయిట్స్ భారీగా నష్టపోయాయి.
మెటల్, రియాల్టీ రంగాలు భారీగా పతనమయ్యాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో సిప్లా, ఓఎన్జీసీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జేఎస్డబ్ల్యు స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హిండాల్కో, టాటా స్టీల్, విప్రో ఉన్నాయి.
మార్కెట్ పతనానికి కారణాలు
గతవారం అంతర్జాతీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా మార్కెట్లలో అమ్మకాల జోరు కనిపించింది. నాస్ డాక్ అయితే ఇటీవలి గరిష్టం నుండి పదహారు శాతం పడిపోయింది. టెక్ స్టాక్స్ కూడా పడిపోయాయి. మంగళవారం అమెరికా ఫెడ్ సమావేశాలు ఉన్నాయి. వడ్డీ రేట్ల పెంపుకు సంకేతాలు ఇచ్చిన ఫెడ్ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. సంస్థాగత ఇన్వెస్టర్లు ఏకంగా రూ.12600 కోట్లకు పైగా అమ్మకాలకు దిగారు. ఇవన్నీ మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి.