హోంలోన్ వడ్డీ రేట్లు పెంచిన SBI, మిగతా బ్యాంకులు అదే దారిలో నడిచే ఛాన్స్
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు షాకిచ్చింది. హోమ్ లోన్స్ పైన కనీస వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఉన్న 6.70 శాతం వడ్డీ రేటు 6.95 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి. ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెంపు మున్ముందు మరింత పెంపుకు సంకేతంగా భావిస్తున్నారు.
అంతకుముందు హోంలోన్ వడ్డీ రేట్లు 6.80 శాతంగా ఉండగా, ఎస్బీఐ మార్చి 1న 6.70 శాతానికి తగ్గించింది. నెల రోజుల పాటు ఈ ఆఫర్ ఇచ్చింది. అంటే ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. ఎస్బీఐ కేవలం వడ్డీ రేట్ల పెంపుతోనే ఆపలేదు. ప్రాసెసింగ్ ఫీజును కూడా యాడ్ చేసింది. ఎస్బీఐ ప్రాసెసింగ్ ఫీజు 0.40 శాతంగా ఉంది. జీఎస్టీ అదనం. ప్రాసెసింగ్ ఫీజు కనీసం రూ.10,000, గరిష్టం రూ.30,000గా ఉంది.
ఎస్బీఐ వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో మిగతా బ్యాంకులు కూడా అదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి. గత నెలలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీతో పాటు పలు బ్యాంకులు నెల రోజుల పాటు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇచ్చాయి. వడ్డీ రేట్లను భారీగా తగ్గించాయి.