Startup news: రాత్రి అయిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో దోమలు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. వీటివల్ల రోగాలు ప్రబలి భారీగా చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుంది. 2022లో దేశ వ్యాప్తంగా 2.3 లక్షల డెంగ్యూ కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి దేశ ఆర్థిక వ్యవస్థపై దోమల ప్రభావం ఎంత ఉంటుందో అంచనా వేయొచ్చు.
ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఓ స్టార్టప్ చక్కటి పరిష్కారాన్ని చూపించింది. కొత్త ఆవిష్కరణతో మార్కెట్లోకి అడుగు పెట్టింది. పూణేకు చెందిన ఎకో బయోట్రాప్స్(EBT) అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. దోమల పెంపకాన్ని నియంత్రించి వాటి పెరుగుదలను అరికట్టే ఆలోచనతో ముందుకొచ్చింది.

దోమలు నీటిలో గుడ్లు పెడతాయి కాబట్టి ఆయా ప్రదేశాల్లో ట్రాప్ బ్యాగ్స్ పెడతారు. వీటిలోని మందు అక్కడి నీటిలో కలిసిపోతుంది. దీని ప్రభావం వల్ల దోమలు, లార్వా రెండూ తక్షణమే మరణిస్తాయి. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా.. ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారవిలో ఈ ఎకో బయోట్రాప్స్ను ఉపయోగించింది. ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది.
'ICICI పౌండేషన్ భాగస్వామ్యంతో ఎకో బయో ట్రాప్లు తయారు చేస్తున్నాం. 8 వారాలపాటు దోమలు గుడ్లు పొదగకుండా అడ్డుకోవడంలో ఇవి 100 శాతం ప్రభావవంతంగా పనిచేశాయి' అని EBT వ్యవస్థాపకులు, CEO ప్రసాద్ ఫడ్కే తెలిపారు. 22 రాష్ట్రాల్లోని 300 జిల్లాల్లో ఎకో బయోట్రాప్లు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ఇప్పటికే వివిధ హోటళ్లు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, IT పార్కులు.. ఏడాది పొడవునా తమతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. 2019లో స్థాపించబడిన EBT.. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా ఇప్పుడు పలు ఆఫ్రికన్ దేశాలతో పాటు నేపాల్, మలేషియా, చైనా వంటి విదేశీ మార్కెట్లలోకి ప్రవేశించాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications