SpiceJet: కరోనాలో ఒక్క ఉద్యోగినీ తొలగించని స్పైస్ జెట్.. ఎలా బతికి బట్టకట్టిందంటే..?
SpiceJet: కరోనా వైరస్ వ్యాప్తి ప్రపంచంలోని మానవాళిని ఎలా కుదిపేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సమయంలో చాలా వ్యాపారాలు సైతం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఇందులో ప్రధానంగా భారీ నష్టాన్ని చవిచూసింది విమానయాన రంగం. అయితే సంక్షోభంలో ఉద్యోగులను తొలగించకుండా, వారికి జీతాలు ఎలా చెల్లించిందనే వివరాలను స్పేస్ జెట్ సీఈవో అజయ్ సింగ్ వెల్లడించారు.
ఇండియూ టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ కరోనా సవాళ్లను కంపెనీ ఎలా అధిగమించిందో సీఈవో అజయ్ వెల్లడించారు. వ్యాప్తిని నిర్మూలించేందుకు కేంద్రం రాత్రికిరాత్రి లాక్ డౌన్ ప్రకటించింది. ఈ క్రమంలో రవాణా వ్యవస్థలు స్థంభించాయి. అయితే ఈ క్రమంలో అద్దెకు తీసుకున్న విమానాల చెల్లింపులు, 12,000 మంది ఉద్యోగుల జీతాల చెల్లింపులకు కంపెనీ కొత్త వ్యాపార మార్గాన్ని అన్వేషించుకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

ప్యాసింజర్ల ప్రయాణాలు నిలిచిపోవటంతో ప్రధాన ఆదాయ వనరుగా కార్గోను మార్చుకుంది స్పైస్ జెట్. ఈ క్రమంలో మెుదటగా ప్రయాణికుల విమానాల్లోని సీట్లలో పెట్టి వస్తువులను తరలించటం కంపెనీ ప్రారంభించింది. భారత ప్రభుత్వం కోసం చైనా నుంచి మెడికల్ అక్విప్మెంట్ తరలింపును చేపట్టింది. అసలు పీపీఈ సూట్ తెలియని తాము తొలిసారిగా చైనాలోని షాంగై నుంచి కోయంబతూర్ కు తరలించింది. ఇలా ఆదాయ వనరులను పెంచుకునేందుకు మరిన్ని మార్గాలను అన్వేషించటం ప్రారంభించింది.

ఇదే క్రమంలో విమానయాన సంస్థ రొయ్యలు సాగుచేసే రైతులను సంప్రదించింది. అలా రొయ్యల గుడ్లను విదేశాలకు తరలించేందుకు ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత వస్తువుల తరలింపు వంటి కార్గో వ్యాపారంపై దృష్టి సారించినట్లు సీఈవో అజయ్ సింగ్ వెల్లడించారు. స్పైస్జెట్ తర్వాత కొన్ని వైడ్ బాడీ ఎయిర్క్రాఫ్ట్లను తీసుకొని మధ్యప్రాచ్యానికి వస్తువులను ఎయిర్ కార్గో పద్ధతిలో తరలించటం ప్రారంభించింది. ఈ విధంగా భయంకరమైన ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీని సజీవంగా ఉంచటం తద్వారా ఉద్యోగులకు జీతాలను చెల్లించగలిగినట్లు తమ అనుభవాన్ని పంచుకున్నారు.


Click it and Unblock the Notifications