బిగ్ డీల్: కళ్లు చెదిరే టేకోవర్: యూఎస్ టాప్ యానిమేషన్ ప్లాట్ఫాం..ఇక సోనీ పిక్చర్స్ వశం
వాషింగ్టన్: కార్పొరేట్ సెక్టార్లో మరో భారీ టేకోవర్ నమోదైంది. అమెరికాకు చెందిన టెలికమ్యూనికేషన్ల దిగ్గజ సంస్థ తన యానిమేషన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ క్రంచీరోల్ను విక్రయించింది. ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా నిలిచిన సోనీ పిక్చర్స్.. ఈ యానిమ్ స్ట్రీమింగ్ సర్వీస్ను కొనుగోలు చేసింది. దీనికోసం 1.175 బిలియన్ డాలర్లను వ్యయం చేసినట్లు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
యానిమేషన్ సెక్టార్లో అడుగు పెట్టినట్టే
ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన అటాక్ ఆన్ టైటాన్, ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్, వన్ పీస్ వంటి యానిమేషన్ ఎపిసోడ్లను ప్రసారం చేయడానికి క్రంచీరోల్ వివిధ దేశాల నుంచి లైసెన్స్లను పొందింది. యానిమేషన్ కంటెంట్ ఉన్న ఎపిసోడ్లకు అత్యంత జనాదరణ లభిస్తోన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తాము క్రంచీరోల్ను కొనుగోలు చేశామని సోనీ ఫనిమేషన్ విభాగం వెల్లడించింది. నెట్ఫ్లిక్స్ వంటి కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లు కూడా యానిమేషన్ సెక్టార్లో భారీగా పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావించింది.
ఎంటర్టైన్మెంట్..డబుల్
తాజాగా- క్రంచీరోల్ను కొనుగోలు చేయడం ద్వారా సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్, సోనీ ఫనిమేషన్ ఈ రంగంలో అడుగు పెట్టినట్టయింది. ఇకపై తమ ప్రయాణం.. ప్రపంచంలోనే టాప్ ఎంటర్టైన్మెంట్ కంపెనీతో సాగబోతోందని క్రంచీరోల్ జనరల్ మేనేజర్ జోవాన్నె వాజ్ పేర్కొన్నారు. అనేక దేశాల్లో క్రంచీరోల్కు అద్భుత స్పందన లభిస్తోందని అన్నారు. మూడు మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు, 50 మిలియన్లకు పైగా సోషల్ మీడియా ఫాలోవర్లు, 90 మిలియన్ల వరకు రిజిస్టర్డ్ యూజర్లు ఉన్నారని, ఇక వారికి డబుల్ ఎంటర్టైన్మెంట్ లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
యానిమ్లో ప్రయోగాలు..
వివిధ దేశాలకు సంబంధించిన సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక ఘట్టాలను గుర్తుకు తీసుకొచ్చేలా యానిమేషన్ కార్యక్రమాలను రూపొందిస్తామని సోనీ ఫనిమనేషన్ గ్లోబల్ గ్రూప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కొలిన్ డెకర్ అన్నారు. యానిమేషన్ రంగంలో మరింత వినూత్న ప్రయోగాలకు తెర తీస్తామని, వీక్షకులకు మరింత చేరువ అవుతామని చెప్పారు. నిజానికి క్రంచీరోల్ కూడా ఏటీ అండ్ టీకి సంబంధించిన సొంత సంస్థ కాదు.
2018లో టేకోవర్ చేసిన ఏటీ అండ్ టీ
దీని మాతృసంస్థ.. ఒట్టెర్ మీడియా. చెర్నిన్ గ్రూప్కు చెందిన ఈ మీడియా విభాగం క్రంచీరోల్ను 2018లో బిలియన్ డాలర్ల మొత్తానికిఏటీ అండ్ టీకి విక్రయించింది. ఏటీ అండ్ టీ గ్రూప్లోకి చేరిన తరువాత.. దీని వేల్యూ మరింత పెరిగింది. ఫాలోవర్లు, వ్యూవర్ల సంఖ్య భారీగా మెరుగు పడింది. దీనికి అదనంగా ఆ సంస్థ రూపొందిస్తోన్న యానిమేషన్ ఎపిసోడ్లు వీక్షకులను కట్టి పడేస్తున్నాయి. దీనితో సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ దీన్ని కొనుగోలు చేసింది. వీక్షకులను ఆలరించేలా మరిన్ని రక్తికట్టించే ఎపిసోడ్లను రూపొందించడానికి ఈ డీల్ ఉపకరిస్తుందని వార్నర్ మీడియా చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ టోనీ గోన్కాల్వ్ తెలిపారు.