ముఖేష్ అంబానీ నెట్ వర్క్ 18లో వాటాలపై సోనీ ఆసక్తి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నేతృత్వంలోని ఇండియన్ టెలివిజన్ నెట్ వర్క్లో పెట్టుబడులు పెట్టేందుకు సోనీ కార్పోరేషన్ చర్చలు జరుపుతోంది. ఇక్కడ కంటెంట్కు మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. నెట్ వర్క్ 18 బ్రాడ్కాస్ట్ లిమిటెడ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది.
ఇందులో వాటాలు కొనుగోలు చేసేందుకు సోనీ చర్చలు జరుపుతోంది. వివిధ రకాల డీల్స్ పైన సోనీ పరిశీలిస్తోందని తెలుస్తోంది. భారతీయ విభాగంలోని తన వ్యాపారాన్ని సోనీ ఇందులో కలిపే అవకాశం ఉంది. వాటాలు కొనుగోలు చేసేందుకు సోనీ చర్చలు జరుపుతోందనే వార్తల నేపథ్యంలో గురువారం షేర్లు భారీగా దూసుకెళ్లాయి. ఈ షేర్లు దాదాపు పదిహేను శాతం ఎగిశాయి. టీవీ 18 బ్రాడ్ కాస్టింగ్ లిమిటెడ్ షేర్లు కూడా దాదాపు 10 శాతం పెరిగాయి.
ఈ డీల్ ఇరు పక్షాలకు లాభదాయకమే. నెట్ ఫ్లిక్స్ వంటి వాటిని ఎదుర్కోవడానికి సోనీకి ఈ డీల్ ఉపయోగపడనుందని చెబుతున్నారు. అలాగే, అంతర్జాతీయ కంటెంట్ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు నెట్ వర్క్18కు అవకాశం.