ఐటీ ఉద్యోగులకు భారీ షాక్..ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఫ్రీగా దొరుకుతుందట.. అంత్రోపిక్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తోందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రాబోయే రోజుల్లో ఇది ఐటీ రంగాన్ని ఊహించని దెబ్బ తీయబోతోందనే చర్చ ఇప్పుడు మొదలైంది. ప్రముఖ ఏఐ సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డారియో అమోడీ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టెక్ కంపెనీల భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే సాఫ్ట్వేర్ అనేది చాలా చౌకగా మారిపోతుందని, ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా "ఉచితం" (Essentially Free) కాబోతుందని ఆయన జోస్యం చెప్పారు.
ఇప్పటివరకు ఒక సాఫ్ట్వేర్ను తయారు చేసి, దానిని లక్షలాది మందికి అమ్మి బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన కంపెనీల బిజినెస్ మోడల్ ఇకపై సాగకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ పరిణామాలు గ్లోబల్ టెక్ మార్కెట్లో సరికొత్త లేఆఫ్స్ (layoffs) భయాలను రేకెత్తిస్తున్నాయి.

కోడింగ్ ఇక ఎంతమాత్రం కష్టం కాదు!
డారియో అమోడీ ది వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "జనరేటివ్ ఏఐ (Generative AI) లో వస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల చాలా తక్కువ ఖర్చుతో, క్షణాల వ్యవధిలో కస్టమైజ్డ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్లను తయారు చేయవచ్చు. మా సాఫ్ట్వేర్ చాలా కాంప్లెక్స్, దీనిని మేము మాత్రమే రాయగలం, ఇతరులు రాయలేరు అని ఏ కంపెనీ అయినా గర్వంగా చెబితే.. ఆ రోజులు ఇక చెల్లిపోయాయి" అని స్పష్టం చేశారు.
ఏఐ టూల్స్ సహాయంతో కోడింగ్ ప్రాసెస్ మొత్తం చాలా ఈజీగా మారిపోతుండటంతో, భారీ సాఫ్ట్వేర్ ప్రొడక్టుల అవసరం క్రమంగా తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత ఐటీ రంగానికి ముప్పు తప్పదా?
ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా భారతదేశానికి పెద్ద అలారంగా మారాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసెస్ హబ్ గా ఉన్న ఇండియాలో.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), టాటా టెక్నాలజీస్ వంటి దిగ్గజ సంస్థలు అంతర్జాతీయ క్లయింట్ల కోసం సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం, దానిని మెయింటైన్ చేయడం ద్వారానే వేల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి.
అయితే, సాంప్రదాయ కోడింగ్ పద్ధతుల స్థానంలో ఏఐ వచ్చేస్తుండటంతో, భవిష్యత్తులో ఈ సంస్థలలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాల కంటే ఏఐ ఉత్పాదకత (Productivity) చాలా వేగంగా దూసుకుపోతోందని, ఇది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నమ్మలేని నిజం ఇదే..
"గత కొన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకుంటూ వచ్చిన కొన్ని రకాల ఉద్యోగాలు, కెరీర్లు భవిష్యత్తులో పూర్తిగా కనుమరుగైపోయే ఛాన్స్ ఉంది" అని ఆంత్రోపిక్ సీఈఓ ఘాటుగా హెచ్చరించారు.
టెక్నాలజీ మారుతున్న కొద్దీ కంపెనీలు భారీగా లేఆఫ్స్ (layoffs) చేపట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ తయారీ ఉచితంగా మారే పరిస్థితి వస్తే, కంపెనీలు తమ మనుగడ కోసం మరింత మంది సిబ్బందిని తగ్గించుకునే ప్రమాదం ఉంది. అందుకే, ఐటీ ఉద్యోగులు కేవలం కోడింగ్కే పరిమితం కాకుండా, మారుతున్న ఏఐ ట్రెండ్స్కు అనుగుణంగా తమ స్కిల్స్ ను అప్గ్రేడ్ చేసుకోవడం అత్యవసరంగా మారింది.


Click it and Unblock the Notifications