మోడీ ప్రభుత్వం ఉద్దీపనలతో... 2020 చివరికల్లా 45,000కు సెన్సెక్స్
వచ్చే ఏడాది సెన్సెక్స్ 45,000 మార్క్ చేరుకోవచ్చునని దేశీయ బ్రోకరేజీ సంస్థ కొటక్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. 2020లో సూచీలు 12.5 శాతం మేర లాభాలు అందుకుంటాయని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ కుంటుతూ నడుస్తోందని, మరో ఏడాది పాటు ఈ తిప్పలు తప్పవని ఆర్థిక నిపుణుల ఇప్పటికే అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న ఉద్ధీపన చర్యలు అన్ని రంగాలకు దీర్ఘకాలంలో ఊతమిస్తాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని చెబుతున్నారు.
ఆర్థిక మందగమనంలోను స్టాక్ మార్కెట్లు అప్పుడప్పుడు మినహా జోరుమీద ఉన్నాయి. స్టాక్ మార్కెట్ల రికార్డుల హోరుకు కాస్త అప్పుడప్పుడు బ్రేక్ పడినా వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ జోరుకు ఢోకా ఉండదని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కోటక్ సెక్యూరిటీస్ కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపింది.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సెన్సెక్స్ 45,500 పాయింట్ల కీలక మైలురాయికి చేరుకుంటుందని నివేదికలో పేర్కొంది. శుక్రవారం నాటి సెన్సెక్స్ ముగింపు 40,445 పాయింట్లతో పోలిస్తే ఇది దాదా పు 12.5 శాతం ఎక్కువ. ఆర్థిక వ్యవస్థలో సెంటిమెంట్ సానుకూలంగా ఉందని, 2020 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 45,500 పాయింట్లకు చేరుకుంటుందని, మోడీ ప్రభుత్వం కార్పోరేట్ పన్ను రేటు తగ్గింపు కారణంగా ఫలితాలు రాణిస్తాయని పేర్కొంది.
కార్పొరేట్ టాక్స్ కోతతో పెరగనున్న కంపెనీల రాబడులు, ఎఫ్పీఐలు, సిప్ పెట్టుబడులు వచ్చే ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్ను ముందుకు తీసుకు వెళ్తాయని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. అయితే నిర్వహణ సరిగా లేని కంపెనీల షేర్ల జోలికి మాత్రం పోవద్దని ఇన్వెస్టర్లను హెచ్చరించింది. వచ్చే ఏడాది ఇన్వెస్టర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశమున్న కొన్ని రంగాలనూ తన నివేదికలో పేర్కొంది.
బ్యాంకింగ్, మాతృసంస్థల అండ ఉన్న NBFCలు, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలు, క్యాపిటల్ గూడ్స్ సంస్థలు, నిర్మాణ రంగ సంస్థలు, నిర్మాణ రంగ కంపెనీలు, హెల్త్ కేర్ కంపెనీలు, ఆగ్రో కెమికల్ కంపెనీలు.