భారీ లాభాల్లో.. సెన్సెక్స్ 724 పాయింట్లు జంప్: అమెరికా సహా కారణాలివే..
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (నవంబర్ 5) భారీ లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో ఇప్పటి వరకు నాలుగు సెషన్లలోను లాభాల్లో ముగిశాయి. ఉదయం ఆరంభంలోనే 400 పాయింట్లకు పైగా లాభాల్లో ఉన్న మార్కెట్లు ఏ దశలోను ఒడిదుడుకులను ఎదుర్కోలేదు. నిన్న 40,616 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు 41 వేల మార్క్ దాటిన తర్వాత ఏ దశలోను కిందకు రాలేదు.
చివరకు సెన్సెక్స్ 724.02 పాయింట్లు(1.78%) లాభపడి 41,340.16 వద్ద, నిఫ్టీ 211.80 పాయింట్లు(1.78%) ఎగిసి 12,120.30 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ చాలా రోజులకు 12వేల మార్క్ దాటింది. 1702 షేర్లు లాభాల్లో, 899 షేర్లు నష్టాల్లో ముగియగా, 171 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
ఎకానమీ ఎఫెక్ట్: అదే లేకుంటే ట్రంప్ చాలా ఈజీగా గెలిచేవారా?
ఎగిసిన రిలయన్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో(6.15 శాతం), ఎస్బీఐ(5.63 శాతం), ఇండస్ ఇండ్ బ్యాంకు (5.36 శాతం), టాటా స్టీల్ (5.35 శాతం), బీపీసీఎల్ (5.00 శాతం) ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్ (0.80 శాతం), హెచ్డీఎఫ్సీ లైఫ్ (0.37 శాతం) ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉన్నాయి.
రెండు రోజులుగా భారీగా నష్టపోయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 2.28 శాతం లాభపడి రూ.1956.80 వద్ద ముగిసింది.
అన్ని రంగాలు కూడా లాభాల్లో ముగిశాయి.
మార్కెట్లు ఈ రోజు దాదాపు రెండు శాతం లాభపడ్డాయి.
డాలర్ మారకంతో రూపాయి 74.36 వద్ద క్లోజ్ అయింది.
నిఫ్టీ మెటల్, నిఫ్టీ మీడియా 4 శాతానికి పైగా జంప్
నిఫ్టీ స్మాల్ క్యాప్, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 1.7 శాతం మేర లాభపడ్డాయి.
సూచీల్లో ఎక్కువ వాటా కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లోకి రావడంతో మార్కెట్లు ఎగిశాయి.
నిఫ్టీ ఆటో 1.19 శాతం, నిఫ్టీ బ్యాంకు 2.10 శాతం, నిఫ్టీ ఎనర్జీ 2.68 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.61 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.92 శాతం, నిఫ్టీ ఐటీ 1.33 శాతం, నిఫ్టీ మీడియా 4.03 శాతం, నిఫ్టీ మెటల్ 4.40 శాతం, నిఫ్టీ ఫార్మా 0.83 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.87 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.89 శాతం మేర లాభపడ్డాయి.
కేవలం నిఫ్టీ రియాల్టీ 0.51 శాతం నష్టపోయింది.
బ్యాంకు, ఎనర్జీ, బ్యాంకింగ్ దాదాపు రెండు శాతం లాభపడగా, మీడియా, మెటల్ ఏకంగా 4 శాతానికి పైగా ఎగిశాయ.
మార్కెట్ లాభాలకు కారణాలు
మార్కెట్ లాభాలకు పలు కారణాలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబిడెన్ దాదాపు గెలిచినట్లేనని భావిస్తున్నారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలు సెనేట్, ప్రతినిధుల సభలో తమ నియంత్రణను యథావిధిగా నిలుపుకుంటాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
యూఎస్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ పాలసీ నిర్ణయంతో ముందుకు రానుంది. వడ్డీరేట్లలో మార్పులు ఉండకపోవచ్చునని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.
8 నెలల తర్వాత సర్వీస్ సెక్టార్ పుంజుకుంది. ఇన్నాళ్లు ప్రతికూలత నమోదు చేసింది. ఇప్పుడు పాజిటివ్గా ఉంది. ఇది దేశీయ ఇన్వెస్టర్ల సెంటుమెంటును బలపరిచింది. దేశంలో కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయి. కరోనా కేసులు తగ్గుతున్నాయ.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఊహించిన దాని కంటే ఎక్కువ ప్యాకేజీని ఇచ్చింది. 150 బిలియన్ పౌండ్లు అంచనా వేయగా 195 బిలియన్ పౌండ్లు ప్రకటించింది. ఇది అంతర్జాతీయ మార్కెట్లకు, ఆసియా మార్కెట్లకు ఊతమిచ్చింది.