సెన్సెక్స్ 400 పాయింట్లు జంప్, 16,300 పాయింట్లు దాటిన నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి కనిపించింది. అయినప్పటికీ లాభాల్లోనే కనిపించాయి. ఆర్థిక మందగమనం భయాలతో గతవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ఆసియా సూచీలు మిశ్రమంగా కదలాడుతున్నాయి. చైనాలో లాక్ డౌన్ ఎత్తివేత, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకం తగ్గింపు వంటి అంశాలు మార్కెట్కు సానుకూలంగా కనిపించాయి.
అయితే ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ద్రవ్యోల్భణ భయాలు, ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల నిర్ణయాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. దీంతో గరిష్టాల వద్ద సూచీలు కాసేపు అమ్మకాల ఒత్తిడికి గురి కావొచ్చునని భావిస్తున్నారు. అయినప్పటికీ నేడు మార్కెట్లు సానుకూలంగానే కదలాడుతున్నాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం 54,459.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,849.01 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,191.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,290.95 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,393.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,207.25 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1 సమయానికి సెన్సెక్స్ 386 పాయింట్లు లాభపడి 54,713 పాయింట్ల వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు ఎగిసి 16,351 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ ఓ సమయంలో 500 పాయింట్లకు పైగా ఎగిసిపడింది.