ఆరో రోజు: దూసుకెళ్లి.. ఆ తర్వాత భారీ లాభాలు లేకుండా ముగిసిన మార్కెట్లు, కారణాలివే
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో రోజు లాభాల్లో ముగిశాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాల అండతో సూచీలు పుంజుకున్నాయి. చివరలో అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో భారీ లాభాలకు అడ్డుగట్ట పడింది. నిఫ్టీ చాలా రోజులకు 10వేల మార్క్ అందుకుంది. ఉదయం మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. చివరి వరకు అదే కొనసాగింది.
ఇప్పట్లో లేనట్లే.. ఫ్లిప్కార్ట్కు షాకిచ్చిన ప్రభుత్వం, ఎందుకంటే
చివరలో అమ్మకాల ఒత్తిడి
లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో 284.01 పాయింట్లు లాభపడి 34,109.54 వద్ద ముగిసింది. నిఫ్టీ 82.45 పాయింట్లు లాభపడి 10,061.55 వద్ద క్లోజ్ అయింది. డాలర్ మారకంతో రూపాయి 75.46 వద్ద ట్రేడ్ అయింది. 1639 షేర్లు లాభాల్లో, 844 షేర్లు నష్టాల్లో ముగియగా 131 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
లాభానికి కారణం..
కరోనా-లాక్ డౌన్ కారణంగా మార్చి 24వ తేదీన నిఫ్టీ 7,511 ఏడాది కనిష్టాన్ని తాకింది. ఆ తర్వాత 46 ట్రేడింగ్ సెషన్లలో తిరిగి 10వేల మార్క్ అందుకుంది. కరోనా - లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడం, అమెరికా - చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నష్టాలు, క్రూడాయిల్ ధరల ఒడిదుడుకులు.. ఇలా ఎన్నో కారణాల మార్కెట్ పైన ప్రభావం చూపాయి. ఇప్పుడు లాభాలకు వివిధ కారణాలు ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లు తిరిగి నిలబడటం, ఆదాయాలు, రుతుపవనాలు సహా వివిధ కారణాలు ఉన్నాయి.
FPI కొనుగోళ్లు
విదేశీ పెట్టుబడిదారుల ప్రవాహం క్రమంగా పెరిగి ఈ మార్కెట్ ర్యాలీ మరింత పుంజుకునేలా చేయనుంది. ఎఫ్పీఐలు రెండు నెలల అమ్మకాల పరంపరను నిలిపేసి మే నెలలో రూ.14,569 కోట్లను, జూన్ నెలలో గత 2 ట్రేడింగ్ సెషన్ (జూన్ 1, 2 తేదీలు)లలో రూ.8,138 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. లాక్ డౌన్ ముగింపు దశకు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటంతో మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది.
టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
మార్కెట్ ముగింపు సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, కొటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఎన్టీపీసీ, విప్రో, భారతీ ఇన్ఫ్రాటెల్, జీ ఎంటర్టైన్మెంట్, యూపీఎల్ ఉన్నాయి.