భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు: టీసీఎస్, ఇన్ఫోసిస్ అదుర్స్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం(సెప్టెంబర్ 8) మందకోడిగా ప్రారంభమయ్యాయి. ఉదయం గం.09:16 సమయానికి సెన్సెక్స్ 64.53 పాయింట్లు (0.17%) నష్టపోయి 38,352.70 వద్ద, నిఫ్టీ 17.10 పాయింట్లు (0.15%) నష్టపోయి 11,337.90 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. 599 షేర్లు లాభాల్లో, 393 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 51 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. అయితే ఆ తర్వాత మార్కెట్లు పుంజుకున్నాయి. మధ్యాహ్నం గం.11.39 సమయానికి సెన్సెక్స్ 253 పాయింట్లు ఎగిసి 38,639 పాయింట్ల వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు ఎగిసి 11,417 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
ఐటీ, ఎనర్జీ స్టాక్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో సాఫ్టువేర్ కంపెనీలు ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ జాబితాలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్ ఉన్నాయి. టాప్ 5 గెయినర్స్ జాబితాలో బీపీసీఎల్ ఉండగా, మిగతా నాలుగు ఐటీ సంస్థలో ఉన్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్ వరుసగా ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఇన్ఫ్రాటెల్, భారతీ ఎయిర్టెల్, గ్రాసీమ్, జీ ఎంటర్టైన్మెంట్, ఓఎన్జీసీ ఉన్నాయి.
మధ్యతరగతి, చిరు వ్యాపారుల కోసం... మరో విడత ఆర్థిక ప్యాకేజీ
కరోనా మహమ్మారి కేసులు పెరగడం, సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ప్రారంభంలో ఆచితూచి వ్యవహరించారు. ఆ తర్వాత చైనాపై మనదే పైచేయి అని తెలియడం, కరోనా ప్యాకేజీ మరో విడత రానుండటం వంటి వివిధ కారణాలతో కాస్త కుదురుకున్నాయి. ఈ రోజు 38 కంపెనీలు ఫలితాలు వెల్లడించనున్నాయి. మరోవైపు డాలర్ మారకంతో రూపాయి 30 పైసలు బలహీనపడి 73.64 వద్ద ప్రారంభమైంది. అంతకుముందు సెషన్లో రూపాయి 73.34 వద్ద క్లోజ్ అయింది.
వొడాఫోన్ ఐడియా నుండి పెట్టుబడుల ప్రకటన వస్తుందని భావించిన ఇన్వెస్టర్లు నిన్న ప్రారంభంలో ఈ షేర్లలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత బ్రాండ్ నేమ్ మార్పు, టారిఫ్ హైక్ గురించి మాత్రమే ప్రకటించడంతో షేర్ ధర ప్రారంభంతో పోలిస్తే తగ్గింది. ఓ సమయంలో 10 శాతం ఎగిసిన ధర ఆ తర్వాత 3 శాతంతో ముగిసింది. ఈ రోజు కూడా 5 శాతం మేర నష్టంతో ట్రేడ్ అవుతోంది. టెక్ దిగ్గజాలు ఇన్ఫోసిస్ షేర్ ధర 2 శాతం ఎగిసి రూ.944 వద్ద, టీసీఎస్ షేర్ ధర 1.6 శాతం ఎగిసి రూ.2,365 వద్ద, HCL టెక్ షేర్ ధర 1.83 శాతం ఎగిసి రూ.721 వద్ద ట్రేడ్ అవతున్నాయి.