భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, అదరగొట్టిన సూచీలు: సెన్సెక్స్ 1100 పాయింట్లు జంప్
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్ల లాభాల్లో ఆరంభించింది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ 1120 పాయింట్లు లేదా 2.12 శాతం ఎగిసి 53,910 పాయింట్ల వద్ద, నిఫ్టీ 348 పాయింట్లు లాభపడి 16,157 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 348 పాయింట్లు ఎగిసి 16,160 పాయింట్ల వద్ద ఉంది.
సెన్సెక్స్ ఉదయం 53,513 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,997 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,403 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 52,792 పాయింట్ల వద్ద ముగియగా, నేడు ఓ సమయంలో 1200 పాయింట్లకు పైగా లాభాల్లో కనిపించింది.
అమెరికా మార్కెట్లు నిన్న లాభాల్లో ముగిశాయి. ఆసియా సూచీలు కూడా నేడు సానుకూలంగా కదలాడుతున్నాయి. చైనా అయిదేళ్ల కాలపరిమితి కలిగిన లోన్ ప్రైమ్ లెండింగ్ రేటు 15 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. ఇటీవలి లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నది. ఇది ఆసియా మార్కెట్లకు సానుకూలంగా మారింది. అమెరికా ఫ్యూచర్స్, ఆసియా సూచీల నుండి సానుకూల సంకేతాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది.