భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1000 పాయింట్ల వరకు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 28) భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలకు తోడు అక్టోబర్ డెరివేటివ్ కాంట్రాక్ట్ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతతో సూచీలు కుప్పకూలాయి. బ్యాంకింగ్, మెటల్, విద్యుత్, రియాల్టీ రంగాల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్ల మేర నష్టపోయింది. నిఫ్టీ 18,000 మార్కును కోల్పోయింది.
అమ్మకాల ఒత్తిడితో ఈ ఉదయం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించిన సూచీలు కాసేపటికే మరింత క్షీణించాయి. మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో సెన్సెక్స్ 978.95(1.60%) పాయింట్లు పతనమై 60,150 వద్ద, నిఫ్టీ 307.55(1.69%) పాయింట్ల నష్టంతో 17,900 వద్ద ట్రేడ్ అయ్యాయి. నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ మిడ్ క్యాప్ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. అదానీ పోర్ట్స్, HDFC, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా పడిపోయాయి.
సెన్సెక్స్ ఉదయం 61,081.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,081.00 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,232.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 18,187.65 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,190.70 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,928.40 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.