మార్కెట్ భారీ పతనం, సెన్సెక్స్ 746 పాయింట్లు డౌన్: రిలయన్స్ మళ్లీ..
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (జనవరి 22) భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలోని ఐదు సెషన్లలో రెండు సెషన్లు లాభపడిన స్టాక్స్, మూడు సెషన్లు నష్టపోయాయి. గతవారం చివరి సెషన్లోను సూచీలు చతికిలపడ్డాయి. ఈ వారం ప్రారంభం (సోమవారం) నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, మంగళ, బుధవారాలు లాభాల్లో ముగిశాయి. నిన్న స్వల్పంగా నష్టపోయిన మార్కెట్లు, నేడు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. సెన్సెక్స్ 49,000 పాయింట్ల దిగువకు పడిపోగా, నిఫ్టీ 14400 మార్కును కోల్పోయింది.
ఇవి మరిచిపోవద్దు.. అలా ఐతే బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయండి! ఛార్జీలు ఉంటాయి
సెన్సెక్స్ డౌన్
సెన్సెక్స్ నేడు 746.22 పాయింట్లు లేదా 1.50% నష్టపోయి 48,878.54 పాయింట్ల వద్ద, నిఫ్టీ 218.50 పాయింట్లు లేదా 1.50% పడిపోయి 14,371.90 పాయింట్ల వద్ద ముగిసింది. 960 షేర్లు లాభాల్లో, 1961 షేర్లు నష్టాల్లో ముగియగా, 132 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 49 వేలకు దిగువకు పడిపోయింది. నిన్న సెన్సెక్స్ 50వేల మార్కును క్రాస్ చేసినప్పటికీ, ఆ మార్కు నుండి ఇప్పటికి 1120 పాయింట్లకు పైగా పడిపోయింది.
డాలర్ మారకంతో రూపాయి 72.97 వద్ద ముగిసింది. నేడు 72.96-73.09 మధ్య ట్రేడ్ అయింది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఆటో 10.43 శాతం, హీరో మోటో కార్ప్ 3.93 శాతం, HUL 1.76 శాతం, ఐచర్ మోటార్స్ 1.57 శాతం, టీసీఎస్ 0.89 శాతం ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు 4.64, JSW స్టీల్ 4.55 శాతం, ఏషియన్ పేయింట్స్ 4.41 శాతం, హిండాల్కో 3.90 శాతం, SBI 3.78 శాతం ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, బజాజ్ ఆటో, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
మార్కెట్లు 2021లో మరో భారీ పతనాన్ని చూశాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.50 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.39 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 1.43 శాతం, నిఫ్టీ ఐటీ 0.15 శాతం మాత్రమే లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 3.17 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.73 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.60 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.19 శాతం, నిఫ్టీ మీడియా 1.65 శాతం, నిఫ్టీ మెటల్ 3.89 శాతం, నిఫ్టీ ఫార్మా 1.22 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.05 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.84 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 3.17 శాతం నష్టపోయాయి.