భారీ నష్టాల్లో మార్కెట్లు, రెండ్రోజుల్లో రూ.6.5 లక్షల కోట్లు హుష్కాకి
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 25) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను కోలుకోలేదు. పైగా అంతకంతకూ నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం ఓ సమయంలో సెన్సెక్స్ దాదాపు 800 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లినప్పటికీ కాస్త పుంజుకొని, 617 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. దీంతో గత రెండు సెషన్లలోనే సెన్సెక్స్ 1500 పాయింట్లకు పైగా క్షీణించింది.
సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
సెన్సెక్స్ ఉదయం 56,757.64 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,875.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,356.87 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ క్రితం సెషన్లో 57,197 పాయింట్ల వద్ద ముగిసింది. కానీ నేడు ఏ సమయంలోను కనీసం 56,9000 తాకలేదు. సెన్సెక్స్ చివరకు 617 పాయింట్లు క్షీణించి 56,579 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 218 పాయింట్లు క్షీణించి 16,954 పాయింట్ల వద్ద ముగిసింది.
మార్కెట్ నష్టానికి కారణాలు
మార్కెట్ నష్టాలకు ఎన్నో కారణాలు ఉన్నాయి. వచ్చే నెల వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్ల మేర పెంచనున్నట్లు అమెరికా ఫెడ్ బ్యాంకు చైర్మన్ జోరోమ్ పోవెల్ ప్రకటించారు. ఇది అంతర్జాతీయ మార్కెట్ పైన ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో భారత మార్కెట్లు కూడా నష్టపోయాయి.
చైనాలో కరోనా వ్యాప్తి ఆసియా - పసిఫిక్ మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీసింది. చైనా సూచీలు ఓ దశలో ఆరు శాతానికి పైగా కుంగాయి. ఎఫ్ఎంసీజీ షేర్లు భారీగా పతనమయ్యాయి. ఇది మరింత నష్టాలకు కారణమైంది. పామాయిల్ పైన ఇండోనేషియా విధించిన నిషేధం ఏప్రిల్ 28న అమల్లోకి రావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది.
అన్ని రంగాలు నష్టాల్లోనే...
మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఈ రెండు రోజుల కాలంలో ఇన్వెస్టర్ల సంపద రూ.6.5 లక్షల కోట్లు తగ్గింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,65,29,671.65 కోట్లకు తగ్గింది. బ్యాంకింగ్ మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి.