అదరగొట్టిన మార్కెట్లు: 60,000 దిశగా సెన్సెక్స్ పరుగు, రాకేష్కు 10 రోజుల్లో రూ.70 కోట్ల రాబడి
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం(సెప్టెంబర్ 23) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు జంప్ చేసింది. సూచీలు మళ్లీ సరికొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ 60,000 పాయింట్లకు 115 పాయింట్ల దూరంలో నిలిచింది. ఓ సమయంలో 59,957 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,850 పాయింట్లకు చేరువైంది. మార్కెట్లు ఉదయం నుండే లాభాల్లో ఉన్నాయి. ఏ దేశలోను కిందకు పడిపోలేదు. పైగా అంతకంతకూ ఎగిసిపడ్డాయి.
సెన్సెక్స్ ఉదయం 59,358.18 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,957.25 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,243.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,670.85 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,843.90 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,646.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 958.03 (1.63%) పాయింట్లు లాభపడి 59,885.36 పాయింట్ల వద్ద, నిఫ్టీ 276.30 (1.57%) పాయింట్లు ఎగిసి 17,822.95 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
మార్కెట్ లాభాలకు కారణాలివే..
అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఇప్పుడే మార్పు చేయకపోవచ్చుననే అంచనాలు మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపాయి. కరోనా వ్యాప్తిపై ఆర్థిక వ్యవస్థ-రికవరీ ఆధారపడి ఉందని, ప్రజారోగ్య సంక్షోభ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉండకూడదంటే వ్యాక్సినేషన్ వేగవంతం కొనసాగాలని, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం రిస్క్ ఇప్పటికీ ఉందని ఫెడ్ ప్రకటించింది. అయినప్పటికీ నిన్న అమెరికా మార్కెట్లు పరుగులు తీశాయి. డౌజోన్స్, నాస్డాక్, ఎస్ అండ్ పీ దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి. జపాన్ నిక్కీ లాభపడింది. బాండ్స్ కొనుగోళ్లు నవంబర్ నుండి తగ్గనున్నాయనే వార్తల నేపథ్యంలో వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ ప్రకటన మార్కెట్లకు ఊరటనిచ్చింది. తాము చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఉద్యోగుల సహకారంతో లక్ష్యాన్ని చేరుకుంటామని ప్రకటించింది. మరోవైపు ఎవర్ గ్రాండ్ సంక్షోభాన్ని తట్టుకునేందుకు చైనా పీపుల్స్ బ్యాంకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే బ్యాంకింగ్ వ్యవస్థలోకి బుధవారం 90 బిలియన్ డాలర్లను చొప్పించింది.
రియాల్టీ సూచీలు పరుగులు తీశాయి. కరోనా కేసులు తగ్గడం, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. బ్యాంకులు పండుగ పేరిట హోమ్ లోన్ వంటి వాటికి అదిరిపోయే ఆఫర్లు ఇచ్చాయి. ఇది రియాల్టీ రంగం డిమాండ్కు ఊతమిచ్చింది. నాలుగు సెషన్లలో రియాల్టీ రంగ సూచీ 20 శాతం పెరిగింది. తద్వారా 52 వారాల గరిష్టాన్ని తాకింది.
నిఫ్టీకి 17,650 పాయింట్ల వద్ద బలమైన ప్రతిఘటన ఎదురైంది. కానీ నేడు 17,700 పాయింట్లు క్రాస్ చేయడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచింది. మార్కెట్ నిపుణులు కూడా నిఫ్టీ 18,000 పాయింట్లను త్వరలో దాటనుందని అంచనా వేస్తున్నారు.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్ (5.05 శాతం), హిండాల్కో (4.37 శాతం), టాటా మోటార్స్ (3.68 శాతం), లార్సన్ (3.44 శాతం), కోల్ ఇండియా (3.24 శాతం) ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ (1.15 శాతం), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ (1.01 శాతం), నెస్ట్లే (0.43 శాతం), ఐటీసీ (0.41 శాతం), టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ (0.41 శాతం) ఉన్నాయి.
రూ.3 లక్షల కోట్లకు పైగా జంప్
నేడు మార్కెట్లు భారీగా జంప్ చేయడంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా ఎగిసిపడంది. నిన్నటికి వీటి మార్కెట్ క్యాప్ రూ.2,58,56,596.22 కోట్లుగా నమోదయింది. నేడు మరో రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గత నాలుగు నెలల కాలంలో ఇదే అత్యంత లాభం. బీఎస్ఈ 30 స్టాక్స్ ఇండెక్స్లో నాలుగు స్టాక్స్ మాత్రమే నష్టపోయాయి. ఐటీ స్టాక్స్ చాలా కాలంగా అదరగొడుతున్నాయి. ఇన్ఫోసిస్ 1.4 శాతం, విప్రో 1 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.84 శాతం, టీసీఎస్ 0.03 శాతం, టెక్ మహీంద్రా 0.37 శాతం, మైండ్ ట్రీ 0.43 శాతం, ఎంఫయాసిస్ 2.47 శాతం లాభపడ్డాయి.
గోద్రేజ్ ప్రాపర్టీస్ స్టాక్ నేడు ఏకంగా 7 శాతం లాభపడింది. దీంతో నిఫ్టీ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 5 శాతం జంప్ చేసింది. నోయిడాలోని తమ లగ్జరీ ప్రాజెక్టులో ఒకేరోజు రూ.575 కోట్ల ప్రాపర్టీని విక్రయించినట్లు గోద్రేజ్ ప్రాపర్టీస్ బుధవారం తెలిపింది. దీంతో ఆ స్టాక్ పరుగులు తీసింది. అలాగే, రియాల్టీ రంగం క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే.
కాగా, ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు చెదిన రేర్ ఎంటర్ప్రైజెస్... జీ ఎంటర్టైన్మెంట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా పది రోజుల్లోనే రూ.70 కోట్లు ఆర్జించింది. రాకేష్ సంస్థ షేర్లు కొనుగోలు చేసిన తర్వాత జీ స్టాక్స్ ఏకంగా 65 శాతం లాభపడ్డాయి.
బలపడిన రూపాయి
అంతర్జాతీయంగా డాలర్ వ్యాల్యూ బలపడుతోంది. అయితే నేడు రూపాయి కాస్త సానుకూలంగా కనిపించింది. గత కొన్నాళ్లుగా డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ క్షీణిస్తోంది. ఇప్పుడు డాలర్ పెరిగినప్పటికీ నిన్నటి ముగింపుతో నేటి ముగింపులో తేడా లేదు. ఇది కాస్త సానుకూలం. నిన్న రూపాయి 73.87 వద్ద ముగిసింది. నేడు కూడా అక్కడే ట్రేడ్ అయింది.