సెన్సెక్స్ 1000 పాయింట్లు జంప్, వీఐఎక్స్ సూచీ 8 శాతం వద్ద..
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (మార్చి 17) భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో ద్రవ్యోల్భణంపై యుద్ధాన్ని తీవ్రతరం చేసినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెంపుపై ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీర్ఘకాలం నుండి పెంపును ఊహించడంతో మార్కెట్లపై ప్రభావం చూపలేదు. పైగా 50 బేసిస్ పాయింట్లు కూడా పెంచుతారనే అంచనాలు ఉన్నాయి. చివరలో మాత్రం 25 బేసిస్ పాయింట్లు పెంచుతారని భావించారు. అదే జరిగింది. దీంతో ఫెడ్ వడ్డీ రేటు ప్రభావం తక్కువగానే ఉంది.
అందుకే మార్కెట్ పరుగు
క్రితం సెషన్లోను మార్కెట్లు పరుగులు పెట్టాయి. నిన్న సెన్సెక్స్ 1040 పాయింట్లు లాభపడటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.4.55 లక్షల కోట్లు పెరిగి రూ.256.21 లక్షల కోట్లకు చేరుకుంది. నేడు మరో వెయ్యి పాయింట్లు జతకలవడంతో మరో రూ.4 లక్షల కోట్ల సంపద పెరిగింది. అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఫెడ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు కాకుండా 25 బేసిస్ పాయింట్లు మాత్రమే పెంచడం, మార్కెట్ అనిశ్చితి సూచీ దిగి రావడం, ఉక్రెయిన్-రష్యా చర్చల ప్రభావం వంటి అంశాలు మార్కెట్ పైన కనిపించాయి.
ప్రధానంగా దీర్ఘకాలం నుండి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని, భావిస్తున్నారు. అయితే 0.5 శాతానికి బదులు 0.25 శాతం పెంచడం కలిసి వచ్చింది. భారత్ వోలాటిలిటీ ఇండెక్స్ (VIX) 8 శాతం వద్ద ఉంది.
రెండ్రోజుల్లో 2000 పాయింట్లకు పైగా
సెన్సెక్స్ నేడు ఉదయం 57,620 పాయింట్ల వద్ద ప్రారంభమై, 57,876 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,518 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నేడు 1050 పాయింట్ల వరకు కూడా లాభపడింది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 994 పాయింట్లు ఎగిసి 57,811 పాయింట్ల వద్ద, నిఫ్టీ 282 పాయింట్లు లాభపడి 17,258 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ రెండు రోజుల్లో 2000 పాయింట్లకు పైగా లాభపడింది.
నేడు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పీఎస్యూ బ్యాంకు స్టాక్స్ 1 శాతం నుండి 2 శాతం చొప్పున లాభపడ్డాయి.టైటాన్, HDFC, కొటక్ బ్యాంకు టాప్ గెయినర్స్గా నిలిచాయి.
అందుకే ఈ ధరలు పెరిగాయ్
డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవడం, వేస్ట్ పేపర్ కొరత కారణంగా పేపర్ ధరలు పెరిగాయి. దీంతో ఈ రంగంలోని స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. ఫ్రాన్స్ కంపెనీతో ఒప్పందం నేపథ్యంలో HAL షేర్లు ఎగిసిపడ్డాయి. గత మూడు నెలల్లో ఈ స్టాక్ 15 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చింది.
మధ్యాహ్నం సెషన్లో టాప్ గెయినర్స్ జాబితాలో HDFC, JSW స్టీల్, టైటాన్ కంపెనీ, ఐచర్ మోటార్స్, ఏషియన్ పేయింట్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో ఐవోసీ, ఓఎన్జీసీ, హెచ్సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్టీపీసీ ఉన్నాయి.