ఒమిక్రాన్ ఎఫెక్ట్ లేదు!! రెండ్రోజుల్లో రూ.5.47 లక్షల కోట్ల సంపద పెరిగింది
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. నిన్న 650 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ నేడు (గురువారం, డిసెంబర్ 2) అంతకుమించి ఎగిసి 776 పాయింట్లు లాభపడింది. మార్కెట్లు ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఏ సమయంలోను సూచీలు నష్టాల్లోకి జారుకోలేదు. ఐటీ, మెటల్, ఆటో, పవర్ రంగాలు పరుగులు పెట్టాయి. పవర్ గ్రిడ్, HDFC బ్యాంకు స్టాక్స్ నాలుగు శాతం చొప్పున లాభపడ్డాయి.
ఓ వైపు ఒమిక్రాన్ ఆందోళనలు నెలకొన్నప్పటికీ ఆయా దేశాల కరోనా కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంటును, జీఎస్టీ కలెక్షన్లు వంటివి కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. వాహన విక్రయాలు క్షీణించినప్పటికీ, కమర్షియల్ వెహికిల్ సేల్స్ పెరిగాయి. మొత్తానికి వాహన విక్రయాలు తగ్గినప్పటికీ సానుకూలత కనిపించింది. ఇవన్నీ మార్కెట్కు సానుకూలంగా ఉన్నాయి.
రెండ్రోజుల్లో 1400 పాయింట్లు
సెన్సెక్స్ 57,781.48 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,513.93 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,680.41 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,183.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,420.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,149.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 776.50 (1.35%) పాయింట్లు ఎగిసి 58,461.29 పాయింట్ల వద్ద, నిఫ్టీ 234.75 (1.37%) పాయింట్లు లాభపడి 17,401.65 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తిరిగి 58,000 పాయింట్లను క్రాస్ చేయడం గమనార్హం. సెన్సెక్స్ రెండు రోజుల్లోనే 1400 పాయింట్లకు పైగా లాభపడింది.
బూస్టర్ డోస్
డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.74.99 వద్ద ఉంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పెద్దగా భయపడాల్సిన పని లేదని, బూస్టర్ డోసుతో అడ్డుకోవచ్చని వార్తలు రావడం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలపడటానికి ఉపయోగపడింది. పలు స్టాక్స్ భారీగా లాభపడ్డాయి.
రూ.5.47 లక్షల కోట్లు జంప్
మార్కెట్లు నేడు 770 పాయింట్లకు పైగా లాభపడటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.28 లక్షల కోట్లు పెరిగింది. బుధవారం 600 పాయింట్లకు పైగా లాభపడి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ 2.19 లక్షల కోట్లు పెరిగింది. ఈ రెండు రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.5.47 లక్షల కోట్లు పెరిగింది.