రెండ్రోజుల్లో 871 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, నష్టాలకు కారణాలివే
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. సెన్సెక్స్ నేడు (ఏప్రిల్ 12, మంగళవారం) 388 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. కేవలం రెండు రోజుల్లోనే సెన్సెక్స్ 871 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 17,600 పాయింట్ల దిగువన ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.71 లక్షల కోట్లకు తగ్గింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు, ఏ దశలోను కోలుకోలేదు. అయితే మధ్యాహ్నం ఓ సమయంలో దాదాపు 700 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరలో కాస్త కోలుకొని 388 పాయింట్ల నష్టాల్లో ముగిసింది.
బాండ్స్ రాబడుల పెరుగుదల, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల పెంపు సంకేతాలు, చైనాలో కరోనా పెరుగుదల, దేశీయంగా కరోనా కొత్త వేరియంట్ ఇన్వెస్టర్లను భయానికి గురి చేస్తున్నాయి. ద్రవ్యోల్భణ ఆందోళనలు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. దీంతో మార్కెట్లు కుప్పకూలాయి. చివరకు సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోయి 58,576 పాయింట్ల వద్ద, నిఫ్టీ 144 పాయింట్లు క్షీణించి 17,530 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.71 లక్షల కోట్లుగా ఉంది.
బ్యాంకింగ్ రంగం మినహా అన్ని రంగాలు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1 శాతం నుండి 3 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక శాతం మేర తగ్గాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, కొటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, మారుతీ సుజుకీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ ఉన్నాయి. టాప్ లూజర్స్లో హిండాల్కో, కోల్ ఇండియా, గ్రాసీమ్, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఉన్నాయి.