భారీ నష్టాల్లో మార్కెట్లు, స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
ముంబై: స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.17 సమయానికి నిఫ్టీ 12,000 లోపు పడిపోయింది. సెన్సెక్స్ 160.51 పాయింట్లు (0.39 శాతం) తగ్గి 40895.18 వద్ద, నిఫ్టీ 51.80 పాయింట్లు (0.43 శాతం) తగ్గి 11994.00 వద్ద ట్రేడ్ అయింది. 318 షేర్లు లాభాల్లో, 442 షేర్లు నష్టాల్లో ట్రేడ్ కాగా, 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. ఉదయం గం.10.26కి సెన్సెక్స్ ఏకంగా 275 పాయింట్లు నష్టపోయి 40,781కి పడిపోయింది. డాలరు మారకంతో రూపాయి విలువ 71.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అంతకు ముందు సెషన్లో 71.29 వద్ద ముగిసింది.
భారత ఆర్థిక వ్యవస్థకు పెనుప్రమాదం! వొడాఫోన్-ఐడియా మూతబడితే.. ఎవరెవరిపై ఎలా?
మార్చి త్రైమాసిక లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చుననే యాపిల్ అంచనాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. దీనికి తోడు కరోనా భయం, ఏజీఆర్ ఛార్జీల చెల్లింపు వంటి పరిణామాలు సూచీల సెంటిమెంటును దెబ్బతీశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, గెయిల్, కొటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, టీసీఎస్, టాప్ లూజర్స్ జాబితాలో యస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, భారతీ ఇన్ఫ్రాటెల్, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఉన్నాయి.
ఎయిర్టెల్ AGR డ్యూస్ చెల్లించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ రోజు భారతీ ఎయిర్ టెల్ షేర్లు 5 శాతం మేర పడిపోయి రూ.560.85కు, వొడాఫోన్ ఐడియా షేర్లు 0.25 పడిపోయి రూ.3.15 వద్ద ఉంది.
బంగారం ధరలు నేడు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. అలాగే దేశీయ జ్యువెల్లర్స్, కొనుగోలుదారుల నుండి డిమాండ్ తగ్గింది. దీంతో పసిడి దిగి వచ్చింది. డాలరుతో రూపాయి మారకం విలువ రికవరీ అయింది. ఆ ప్రభావం కూడా పడింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.08 శాతం పడిపోయి 1,585 డాలర్లుగా ఉంది. వెండి ధర మాత్రం ఔన్స్కు 0.33 శాతం పెరిగి 17.79 డాలర్లకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.100 తగ్గి రూ.39,250కి అటు ఇటుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ.140 తగ్గి రూ.42,640గా ఉంది.
SBI క్రెడిట్ కార్డ్ విభాగం ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఐపీఓ ఈ నెల చివరివారంలో లేదా వచ్చే నెల మొదట్లోగానీ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఐపీఓకు ఇటీవలనే సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓలో రూ.500 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు 13.05 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో విక్రయిస్తారు. దీంట్లో SBI 3.7 కోట్లు, కార్లైల్ గ్రూప్ 9.32 కోట్ల షేర్లను విక్రయిస్తుంది. ఈ ఐపీఓ సైజ్ రూ.6,000 కోట్లకు మించి ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.