భారీగా నష్టపోయిన మార్కెట్లు, సెన్సెక్స్ 889 పాయింట్లు పతనం: ఎందుకంటే
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఒమిక్రాన్ భయాలు, ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రతికూల ప్రభావం చూపాయి. అమెరికా మార్కెట్లు క్రితం సెషన్ల్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.87 శాతం నష్టపోయింది. సెన్సెక్స్ ఉదయం 58,021.63 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,062.28 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,950.98 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,276.00 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,298.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,966.45 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 889.40 (1.54%) పాయింట్లు నష్టపోయి 57,011.74 పాయింట్ల వద్ద, నిఫ్టీ 263.20 (1.53%) పాయింట్లు నష్టపోయి 16,985.20 పాయింట్ల వద్ద ముగిసింది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. త్వరలో ఇది ప్రపంచ దేశాల్లో ప్రబలరూపకంగా మారే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఒమిక్రాన్ 77 దేశాలకు వ్యాప్తి చెందింది. మరోవైపు దీనిపై వ్యాక్సిన్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయనే అంశంపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు భారత్లో ఒమిక్రాన్ కేసులు 100కు చేరువయ్యాయి. అలాగే ఇది గాలి ద్వారా వ్యాపిస్తోందన్న ప్రభుత్వ వర్గాల హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. కరోనా సంక్షోభం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్న తొలి ప్రధాన కేంద్ర బ్యాంకు ఇది. ద్రవ్యోల్భణ కట్టడి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు, ఫెడ్ నాలుగు దశాబ్దాల గరిష్టాలకు చేరుకున్న తర్వాత ఉద్దీపనల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తోంది. కరోనా సంక్షోభం దృష్ట్యా భారీగా తగ్గించిన వచ్చే సంవత్సరం మూడుదఫాలుగా పెంచనుంది. 2023లో మరో మూడుసార్లు పెంచనుంది. ఇవి మార్కెట్ పైన ప్రభావం చూపాయి.