అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (బుధవారం, జనవరి 20) లాభాల్లో ప్రారంభం అయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 39.97 పాయింట్లు లేదా 0.08% లాభపడి 49,438.26 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12.00 పాయింట్లు లేదా 0.08% ఎగిసి 14,533.20 పాయింట్ల వద్ద కదలాడింది. 846 షేర్లు లాభాల్లో, 345 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 63 షేర్లలో ఎలాంటి మార్పులేదు. గత వారం చివరి సెషన్లో, ఈ వారం ప్రారంభ సెషన్లో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. ఈ రెండు రోజుల్లో దాదాపు వెయ్యి పాయింట్లు నష్టపోయింది. అయితే నిన్న సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా లాభపడి, రెండు రోజుల నష్టాలను దాదాపు కవర్ చేసింది. ఈ రోజు కూడా మార్కెట్లు లాభాల్లోనే ఉన్నాయి. అమెరికా భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించనుందని వార్తలు రావడంతో అంతర్జాతీయ, ఆసియా మార్కెట్లు జంప్ చేశాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది.
300 పాయింట్లు జంప్
సెన్సెక్స్ నేడు ఓ సమయంలో 300 పాయింట్ల మేర లాభపడింది. సెన్సెక్స్ 49,508.79 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,722.61 వద్ద గరిష్టాన్ని, 49,373.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.45 నిమిషాలకు 350 పాయింట్ల మేర కదలాడింది. ఇక, డాలర్ మారకంతో రూపాయి 73.11 వద్ద ప్రారంభమైంది. క్రితం సెషన్లో 73.17 వద్ద క్లోజ్ అయింది. డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్లు పెరగడంతో రూపాయి కాస్త సానుకూలంగా ఉంది.
టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.51 శాతం, విప్రో 3.39 శాతం, టెక్ మహీంద్రా 2.40 శాతం, HCL టెక్ 2.34 శాతం, అదానీ పోర్ట్స్ 2.15 శాతం లాభాల్లో ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో NTPC 1.05 శాతం, శ్రీసిమెంట్స్ 1.02 శాతం, గ్రాసీమ్ 0.82 శాతం, ITC 0.55 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.57 శాతం నష్టపోయాయి.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు మరో 0.54 శాతం లాభపడి రూ.2027కు ఎగిసింది. ఐటీ స్టాక్స్ అదరగొట్టాయి.
రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.54 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.10 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 1.35 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.36 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.06 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.19 శాతం, నిఫ్టీ ఐటీ 2.11 శాతం, నిఫ్టీ మీడియా 1.43 శాతం, నిఫ్టీ మెటల్ 0.58 శాతం, నిఫ్టీ ఫార్మా 0.65 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.29 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.41 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.45 శాతం లాభపడ్డాయి.