సెన్సెక్స్ సరికొత్త రికార్డ్, 12,000 మార్క్కు చేరువలో నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ట్రేడింగ్ ప్రారంభంలోనే ఓ దశలో 40,434 లైఫ్ టైమ్ హైకి చేరుకుంది. మధ్యాహ్నం గం.11.30 సమయానికి సెన్సెక్స్ 232.02 (0.58%) పాయింట్లు ఎగిసి 40,397.05కు చేరుకుంది. నిఫ్టీ 73.15 (0.62%) పాయింట్లు పెరిగి 11,963.75కి చేరుకుంది. నిఫ్టీ 12,000 మార్క్కు సమీపంలో ఉంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.70.69 వద్ద ట్రేడ్ అయింది.
ఫారన్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు ప్రకటించవచ్చుననే సానుకూల అంచనాలు, కంపెనీల ఆశాజనక త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గతవారం మార్కెట్లు కొత్త రికార్డులు సృష్టించాయి. తాజాగా, సోమవారం కూడా అదే సెంటిమెంటుతో మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడ్ ప్రారంభించాయి. ఐసీఐసీఐ, రియలన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
మార్కెట్లు ఉదయం 9.19 గంటలకు ప్రారంభమైన సమయంలో సెన్సెక్స్ 144 పాయింట్లు లేదా 0.36 శాతం పెరిగి 40309.29 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 52.40 పాయింట్లు లేదా 0.44 శాతం పెరిగి 11943.00 పాయింట్లు పెరిగింది. ఆ సమయంలో టాటా స్టీల్, వేదాంత, ఇండస్ ఇండ్ బాయాంకు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. యస్ బ్యాంకు, టాటా మోటార్స్, మహీంద్రా అంట్ మహీంద్రా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
మధ్యాహ్నం గం.12 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో భారతి ఇన్ఫ్రాటెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, వేదాంత ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, హీరో మోటో కార్ప్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఐవోసీ ఉన్నాయి.