భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్: మెటల్, బ్యాంకింగ్ పతనం
ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (జనవరి 18) భారీ నష్టాల్లో ఉన్నాయి. ఉదయం నుండి మార్కెట్లు పతనంలోనే ఉన్నాయి. ప్రారంభం నుండి అంతకంతకూ కిందకు పడిపోయాయి. ఉదయం గం.11 సమయానికి 409 పాయింట్లు పతనమైంది. ఆ తర్వాత అతి స్వల్పంగా మాత్రమే కోలుకున్నది. కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎనర్జీ రంగాలు మినహా మిగతా సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. మార్కెట్ విక్స్ సూచీ 3.7 శాతం పెరిగింది. చాలామంది లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు కిందకు పడిపోయాయి.
సెన్సెక్స్ కనిష్టం, గరిష్టం
ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 56.81 పాయింట్లు లేదా 0.12% నష్టపోయి 48,977.86 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 21.70 పాయింట్లు లేదా 0.15% పడిపోయి 14,412 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. మధ్యాహ్నం సమయానికి సెన్సెక్స్ కనిష్టం 48,252 పాయింట్లు కాగా, గరిష్టం 49,122 పాయింట్లు. 600 పాయింట్ల మధ్య కదలాడింది. 710 షేర్లు లాభాల్లో, 662 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 89 షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 73.24 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
మోస్ట్ యాక్టివ్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో UPL 4.56 శాతం, రిలయన్స్ 1.62 శాతం, HDFC బ్యాంకు 1.52 శాతం, బ్రిటానియా 1.36 శాతం, ITC 1.24 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.09 శాతం, టాటా స్టీల్ 4.44 శాతం, ONGC 4.39 శాతం, హిండాల్కో, 4.07 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 3.87 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
రంగాలవారీగా
నిఫ్టీ 50 సూచీ 0.85 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.85 శాతం మేర నష్టపోయాయి. రంగాలవారీగా నిఫ్టీ ఆటో 2.26 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.19 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.48 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.31 శాతం, నిఫ్టీ ఐటీ 1.26 శాతం, నిఫ్టీ మీడియా 2.10 శాతం, నిఫ్టీ మెటల్ 3.78 శాతం, నిఫ్టీ ఫార్మా 1.89 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 2.41 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.78 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.05 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.08 శాతం లాభపడింది.