ఐటీ, ఆటో దెబ్బ: భారీ నష్టాల నుండి స్వల్ప నష్టాల్లోకి మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం(మే 2) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం సమయానికి నష్టాలు కాస్త తగ్గాయి. అయినప్పటికీ సెన్సెక్స్ 57,000 పాయింట్లకు దిగువనే ఉంది. నిఫ్టీ 17,000 పాయింట్లకు కాస్త పైన కదలాడింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆపిల్, అమెజాన్ త్రైమాసిక ఫలితాలు నిరాశపరిచాయి. దీంతో అక్కడి మార్కెట్లు నష్టపోయాయి. ప్రస్తుతం అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.
ఫెడ్ రిజర్వ్ మీటింగ్, ఆసియా-పసిఫిక్ మార్కెట్ నష్టాల్లో ఉండటం, చైనాలో కఠిన లాక్ డౌన్, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ నెల 3-4 తేదీల్లో జరగనున్న అమెరికా ఫెడ్ సమావేశాల్లో వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చుననే అంచనాలు ఉన్నాయి. దేశీయంగా కంపెనీల త్రైమాసిక ఫలితాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 56,429 పాయింట్ల వద్ద ప్రారంభమై, 56,865 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 56,412 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం గం.12.33 సమయానికి సెన్సెక్స్ 171 పాయింట్లు క్షీణించి 56.885 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 600 పాయింట్ల మేర కూడా నష్టపోయింది. నిఫ్టీ 60 పాయింట్లు క్షీణించి 17,042 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. ఐటీ, ఆటో, పీఎస్యు బ్యాంకింగ్ స్టాక్స్ భారీ నష్టాలకు కారణమయ్యాయి.