ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు: నష్టాల్లో టాటా స్టీల్స్, టాటా మోటార్స్ అదుర్స్
స్టాక్ మార్కెట్లు నేడు దాదాపు ఫ్లాట్గా ఉన్నాయి. అతిస్వల్ప నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, ఆ తర్వాత అంతేస్థాయిలో లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. మొన్న కుప్పకూలిన సూచీలు, నిన్న ప్రారంభంలో లాభపడినప్పటికీ, సాయంత్రానికి నష్టాల్లో ముగిశాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఆసియా - పసిఫిక్ సూచీలు అలాగే ఉన్నాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ ఈ రోజు రెపో రేటు సహా వివిధ అంశాలపై కీలక ప్రకటనలు చేయనుంది. ఈ నేపథ్యంలో సూచీలు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.
అమెరికాలో ద్రవ్యోల్భణం 40 ఏళ్ల గరిష్టానికి చేరింది. వడ్డీ రేటు ఎంత వేగంగా ఉండనుందనేది నేడు ఫెడ్ ప్రకటిస్తుంది. మన దేశంలోను హోల్ సేల్ ద్రవ్యోల్భణం మే నెలలో 30 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. ఆర్బీఐ ఇప్పటికే వడ్డీ రేట్లను 90 బేసిస్ పాయింట్లు పెంచింది. మరింత వేగంగా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా మార్కెట్ ఊగిసలాటకు కారణమయ్యాయి.
సెన్సెక్స్ ఉదయం 52,650 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,819 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,538 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.30 సమయానికి సెన్సెక్స్ కేవలం 250 పాయింట్ల పైకి, కిందకు కదలాడింది. ఈ వార్త రాసే సమయానికి సెన్సెక్స్ 52.690 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15723 పాయింట్ల వద్ద ఉంది. స్వల్ప నష్టాలు, లాభాల మధ్య ఊగిసలాటలో ఉన్నాయి.
ఆటో, పవర్ స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు కనిపిస్తుండగా, ఎఫ్ఎంసీజీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మంగళూర్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ స్టాక్స్ దాదాపు 5 శాతం లాభపడగా, టాటా స్టీల్ స్టాక్ దాదాపు 4 శాతం నష్టాల్లో ఉంది. టాప్ గెయినర్స్ జాబితాలో బజాజ్ ఫిన్ సర్వ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, గ్రాసీమ్, మారుతీ సుజుకీ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టాటా స్టీల్, HUL, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్, కోల్ ఇండియా ఉన్నాయి.