భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్: ఐటీ, ఆటో స్టాక్స్ కొనుగోళ్లకు మొగ్గు
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం (సెప్టెంబర్ 25) భారీ లాభాల్లో ప్రారంభం అయ్యాయి. వరుసగా ఆరు రోజుల పాటు మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఈ రోజు ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 335 పాయింట్లు(0.92%) లాభపడి 36,888 వద్ద, నిఫ్టీ 95.60 పాయింట్లు(0.88%) లాభపడి 10,901 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 373 పాయింట్లు లాభపడి 36,926 పాయింట్లతో ఉంది.
768 షేర్లు లాభాల్లో, 199 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. 35షేర్లలో ఎలాంటి మార్పులేదు. డాలర్ మారకంతో రూపాయి 15 పైసలు లాభపడి రూ.73.75 వద్ద ప్రారంభమైంది. ఐటీ, మెటల్, ఆటో స్టాక్స్ భారీ లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి.
6 రోజుల్లో రూ.11 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, ఈరోజే రూ.4 లక్షల కోట్లు హుష్కాకి
పుంజుకున్న ఐటీ స్టాక్స్
- ఉదయం గం.10.30 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, ఐచర్ మోటార్స్, సిప్లా ఉన్నాయి.
- టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా, టైటాన్ కంపెనీ, కొటక్ మహీంద్రా, బీపీసీఎల్, హిండాల్కో ఉన్నాయి.
- నిఫ్టీ ఐటీ 2 శాతానికి పైగా లాభపడింది. టీసీఎస్ 3.50 శాతం, కోఫోర్జ్ 3 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.60 శాతం, మైండ్ ట్రీ 1.76 శాతం, ఇన్ఫోసిస్ 1.65 శాతం, ఎంఫయాసిస్ 1.61 శాతం, టెక్ మహీంద్రా 1.51 శాతం, విప్రో 0.56 శాతం లాభపడ్డాయి. ఒక ఎల్టీఈ మాత్రమే 0.60 శాతం మేర నష్టాల్లో ప్రారంభమైంది.
స్టాక్స్ అన్నీ లాభాల్లో..
బీఎస్ఈ సెన్సెక్స్లో అన్ని స్టాక్స్ కూడా లాభాల్లోనే ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంకు 3.12 శాతం, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఓఎన్జీసీ, రిలయన్స్, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్ 1 శాతం నుండి 3 శాతం మధ్య లాభపడ్డాయి. హిందూస్తాన్ యూనీ లీవర్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఏషియన్ పేయింట్స్, నెస్ట్లే, ఎస్బీఐ, ఎన్టీపీసీ, టైటాన్, ఎల్ అండ్ టీ, అల్ట్రా టెక్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, కొటక్ మహీంద్ర బ్యాంకు 1 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి.
కొనుగోళ్లకు మొగ్గు..
శుక్రవారం మార్కెట్లు ఒక శాతం మేర లాభాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్లో బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ రెండు నెలల కనిష్టం వద్ద ముగిశాయి. ఈ రోజు ఓ సమయంలో సెన్సెక్స్ 438 పాయింట్ల మేర లాభపడింది. దీంతో రెండు నెలల కనిష్టం నుండి తిరిగి రీబౌండ్ అయింది. ఎన్నికల సంఘం బీహార్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.