కరోనా కేసుల తగ్గుదల, రూ.2.8 లక్షల కోట్ల సంపద పెరిగింది
భారత సూచీలు మంగళవారం (మే 18) భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండో రోజు సెన్సెక్స్, నిఫ్టీ ఎగిసిపడింది. నిన్న 848 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, నేడు మరో 600 పాయింట్లకు పైగా ఎగిసింది. రెండు రోజుల్లోనే 1460 పాయింట్లు జంప్ చేసింది. నేడు సెన్సెక్స్ 612.60 (1.24%) పాయింట్లు లాభపడి 50,193.33 పాయింట్ల వద్ద, నిఫ్టీ 188.90 పాయింట్లు లాభపడి 15,110 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో సూచీలు భారీగా లాభపడటం ఇదే మొదటిసారి. సూచీలు ఎగిసిపడటానికి పలు కారణాలు ఉన్నాయి.
కరోనా కేసుల తగ్గుదల, ప్రాఫిట్ బుకింగ్
ప్రధానంగా దేశంలో కరోనా కేసులు తగ్గడం కలిసి వచ్చింది. గత వారం వరకు ప్రతి రోజు 3 లక్షలకు మించి కొత్త కేసులు నమోదయ్యాయి. మూడు రోజులుగా కొత్త కేసులు 3 లక్షల దిగువకు వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఇదే సమయంలో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు ఆసక్తి కనబరుస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరోవైపు, ప్రపంచ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు కనిపించాయి. ఐరోపా సూచీలు లాభపడ్డాయి. అమెరికా సూచీల ఫ్యూచర్స్ కూడా లాభాల్లో ఉన్నాయి. మన మార్కెట్ పైన ఇవన్నీ ప్రభావం చూపాయి.
రూ.2.8 లక్షల కోట్లు
సెన్సెక్స్ 30 స్టాక్స్లో 25 స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే రూ.2.8 లక్షల కోట్లు ఎగిసింది. దీంతో కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.213.6 లక్షల కోట్ల నుండి రూ.216.4 లక్షల కోట్లకు పెరిగింది.
రెండు నెలల తర్వాత...
దాదాపు రెండు నెలల తర్వాత నిఫ్టీ దూకుడు పెరిగిందని, మళ్లీ 15,000 మార్కును దాటిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత రెండు సెషన్లలో ముఖ్యమంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు రాణించాయని గుర్తు చేస్తున్నారు. గత ఒకటి లేదా రెండు నెలలుగా ఇవి క్షీణించాయి. సెన్సెక్స్ నేడు 1.24 శాతం, నిఫ్టీ 1.24 శాతం, బ్యాంక్ నిఫ్టీ 1.34 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ మీడియా 2.63 శాతం లాభపడగా, నిఫ్టీ పీఎస్యు బ్యాంకు మాత్రం 0.22 శాతం క్షీణించింది.