ఏప్రిల్ 2022 తర్వాత సెన్సెక్స్, నిఫ్టీకి అతిపెద్ద వీక్లీ గెయిన్
బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు జూన్ 20వ తేదీ నుండి ఈ వారం రోజుల్లో ఒక్కోటి నాలుగు శాతం చొప్పున లాభపడ్డాయి. ఏప్రిల్ 2022 నుండి ఇది ఒక వారంలో ఇదే అతిపెద్ద లాభం. ప్రధానంగా ఆటో స్టాక్స్ లాభపడటంతో మార్కెట్లు వరుసగా లాభాల్లో ముగుస్తున్నాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు దేశీయంగా సానుకూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరుస్తున్నాయి. దీంతో సూచీలు వరుసగా మూడో ట్రేడింగ్ రోజు లాభాల్లో ముగిశాయి.
ఆటో రంగం స్టాక్స్ దూకుడుకు ఐటీ రంగం జత కలిసింది. అలాగే, మిగతా రంగ షేర్లకు కూడా కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ రెండు వారాల గరిష్టానికి చేరుకున్నాయి. నిన్నటి వరకు మూడు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1378 పాయింట్లు, నిఫ్టీ 418 పాయింట్లు లాభపడింది. డాలర్ మారకంతో రూపాయి 4 పైసలు క్షీణించి 78.37 వద్ద ముగిసింది.
ఫారెన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (FII)లు తమ పెట్టుబడులను పెద్ద మొత్తంలో వెనక్కి తీసుకుంటున్నారు. సెన్సెక్స్ క్రితం సెషన్లో 53,161 పాయింట్ల వద్ద, నిఫ్టీ 15,832 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు అక్టోబర్ 18, 2021న వరుసగా 61,765 పాయింట్లు, 18,477 పాయింట్లను తాకాయి. అప్పటి నుండి ఇవి పదిహేను శాతం క్షీణించాయి.