భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, ఐటీ, బ్యాంకింగ్ అదుర్స్
స్టాక్ మార్కెట్లు నేడు (శుక్రవారం, మే 27) లాభాల్లో ప్రారంభమై, రోజంతా ఇదే ఒరవడిని కొనసాగించింది. చివరకు భారీ లాభాల్లో ముగిసింది. నేడు ఉదయం సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమై, మధ్యాహ్నం సమయానికి లాభాలు కాస్త తగ్గినప్పటికీ, ఆ తర్వాత మరింత జోరందుకున్నాయి. 400కు పైగా పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, ఓ సమయంలో 200 దిగువ పాయింట్ల లాభాలకు పడిపోయినప్పటికీ, చివరకు మరింత పుంజుకొని 600 పాయింట్లకు పైగా లాభాల్లో ముగిసింది.
సెన్సెక్స్ ఉదయం 54,671.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 54,936.63 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,449.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 632.13 పాయింట్లు లేదా 1.17 శాతం లాభపడి 54,884.66 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 182.30 (1.13%) పాయింట్లు ఎగిసి 16,352 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతానికి పైగా లాభాల్లో ముగిశాయి.
అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఇది ఆసియా సహా మన మార్కెట్లకు కలిసి వచ్చింది. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ ఇటీవలి గరిష్టాలతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇది మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది. ఆర్బీఐ తన వార్షిక నివేదికలో భారత వృద్ధిపై సానుకూల ప్రకటన చేసింది. ఇది ఇన్వెస్టర్ల సెంటుమెంటును బలపరిచింది. ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్ మినహా మిగతా అన్ని రంగాలు లాభాల్లో ముగిశాయి. ఐటీ, బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు టాప్ గెయినర్స్గా ఉన్నాయి.