ఒకరోజు నష్టం తర్వాత భారీగా పుంజుకున్న మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి. గం.9.16 సమయానికి సెన్సెక్స్ 154.05 పాయింట్లు లేదా 0.42% ఎగిసి 36,483.06 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లేదా 0.37% లాభపడి 10,745.80 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఆ తర్వాత మధ్యాహ్నం గం.12.47 సమయానికి సెన్సెక్స్ 315 పాయింట్ల లాభాల్లోకి వెళ్లింది. 740 షేర్లు లాభాల్లో, 327 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా 34 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.
72 లక్షల మంది PF ఖాతాదారులకు కేంద్రం గుడ్న్యూస్: ఆగస్ట్ వరకు పీఎఫ్ కాంట్రిబ్యూషన్
మధ్యాహ్నం సమయానికి ఎఫ్ఎంసీజీ, ఆటో, ఐటీ రంగాలు మినహా మిగతావి లాభాల్లో ఉన్నాయి. ఫైనాన్షియల్, మెటల్ స్టాక్స్ భారీగా ఎగిశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, బజాజ్ ఫైనాన్స్, గెయిల్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్, హీరో మోటో కార్ప్, విప్రో, టెక్ మహీంద్రా, యూపీఎల్ ఉన్నాయి.
నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. నేడు ఐటీ దిగ్గజం టీసీఎస్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది. మొత్తం 19 కంపెనీలు ప్రకటించనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
అయిదు రోజుల పాటు వరుసగా లాభాలు మూటగట్టుకున్న మార్కెట్లు నిన్న నష్టపోయిన విషయం తెలిసిందే. ట్రేడింగ్ చివరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్ 346 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో ముగిసింది. డాలర్ మారకంతో రూపాయి కూడా 9 పైసలు తగ్గి 75.02 వద్ద ముగిసింది. నేడు తిరిగి కోలుకున్నాయి.