భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, లక్షల కోట్ల సంపద ఆవిరి
అమెరికా ద్రవ్యోల్బణం నలభై ఏళ్ళ గరిష్టానికి చేరుకోవడం, ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్భణం ఆందోళనల మధ్య బ్యాంకింగ్, ఐటీ, మెటల్ స్టాక్స్ గత మూడు వారాల్లో భారీగా క్షీణించాయి. గత మూడు వారాల్లో నిఫ్టీ 50 భారీగా పతనమైంది. సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ నేడు (జూన్ 13, 2022) 1456 పాయింట్లు లేదా 2.68 శాతం క్షీణించి 52,846 పాయింట్ల వద్ద, నిఫ్టీ 427 పాయింట్లు క్షీణించి 15,774 పాయింట్ల వద్ద ముగిసింది.
సెన్సెక్స్ నేడు ఉదయం 53,184 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,207 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,527 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ ఓ సమయంలో 1700 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు కోలుకున్నట్లుగా కనిపించినప్పటికీ, స్వల్పమే. కేవలం 300 పాయింట్లు కోలుకొని, 1456 పాయింట్ల నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు 3 శాతం నష్టపోయాయి.
నేడు మార్కెట్లు కుప్పకూలడంతో దాదాపు రూ.6 లక్షల కోట్ల వరకు ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. గతవారం ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.251.84 లక్షల కోట్లు కాగా, నేడు రూ.6 లక్షల కోట్లకు పైగా క్షీణించి రూ.246 లక్షల కోట్ల స్థాయికి పడిపోయింది. ఓ సమయంలో రూ.245 లక్షల కోట్ల దిగువకు కూడా వచ్చింది.