రోజంతా ఊగిసలాట.. స్వల్పలాభాల్లో ముగిసిన మార్కెట్లు, ఫ్లాట్గా రూపాయి
ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం (ఆగస్ట్ 7) ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఉదయంకూడా ఫ్లాట్గానే ప్రారంభమైన మార్కెట్లలో ఆద్యంతం ఒడిదుడుకులు కొనసాగి, చివరకు అతిస్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 15 పాయింట్లు లాభపడి 38,040 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లు ఎగిసి 11,214 వద్ద ముగిసింది.
మార్కెట్లు ముగిసే సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫిన్ సర్వ్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో టైటాన్ కంపెనీ, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు నష్టాల్లో ముగిశాయి. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
మార్కెట్లను ప్రభావితం చేయగలిగే అంశాలు లేకపోవడం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడం, వారంతం కావడం, కరోనా కేసులు పెరగడం వంటి వివిధ అంశాలు మార్కెట్లు ఫ్లాట్గా ఉండేందుకు కారణంగా కనిపిస్తోంది. ట్రంప్ నిర్ణయం సహా వివిధ కారణాలతో ఐటీ రంగం ఇంకా ఒత్తిడిలోనే కొనసాగుతోంది.
డాలర్ మారకంతో రూపాయి ఓ సమయంలో 12 పైసలు నష్టపోయి 75.05 వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత కోలుకొని చివరకు 74.93 వద్ద క్లోజ్ అయింది. 74.91 నుండి 75.05 మధ్య ట్రేడ్ అయింది. రూపాయి ఈ ఏప్రిల్ నెలలో డాలర్ మారకంతో 76.91 వద్ద ఆల్ టైమ్ కనిష్టం వద్ద ట్రేడ్ అయింది.