ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్, నష్టాల నుండి బయటకు వచ్చి ఫ్లాట్గా ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం ఊగిసలాటలో ట్రేడ్ అయ్యాయి. చివరకు అతి స్వల్ప నష్టాల్లో లేదా స్థిరంగా ముగిశాయి. మధ్యాహ్నం గం.1 సమయంలో భారీ నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు మధ్యాహ్నం వరకు ఊగిసలాటలో ఉన్నాయి. ఐటీ, టెక్, టెలికాం, ఆటో, మెటల్ రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో ఇంట్రాడే కనిష్ఠాలకు చేరుకున్నాయి. చివరలో ఇంధన, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల్లో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు కనిష్ఠాల నుండి కోలుకున్నాయి.
అయితే పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేదు. అంతర్జాతీయ మార్కెట్ నుండి ప్రతికూల సంకేతాలు వచ్చాయి. దీనికి తోడు గత కొద్ది రోజులుగా సూచీలు ఎప్పటికప్పుడు లాభాల్లోకి వెళ్తూ, సరికొత్త గరిష్టాలను తాకుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో సూచీల పరుగుకు బ్రేక్ పడింది.
సెన్సెక్స్ నేడు ఉదయం 58,350.56 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,372.94 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 57,924.48 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,375.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,383.40 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,254.20 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 29.22 (0.050%) పాయింట్లు నష్టపోయి 58,250.26 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8.60 (0.050%) పాయింట్లు క్షీణించి 17,353.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ 30 షేర్లలో సగం లాభపడ్డాయి. కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ, టైటాన్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, HUL, HDFC బ్యాంకు, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రాణించాయి. నెస్లే, మారుతీ, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఆటో, టీసీఎస్ ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, టెక్ మహీంద్రా, రిలయన్స్ నష్టపోయాయి. నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో కొటక్ మహీంద్రా, రిలయన్స్, టీసీఎస్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఉన్నాయి. కొటక్ మహీంద్రా 2.86 శాతం, బీపీసీఎల్ 1.58 శాతం, గ్రాసీమ్ 1.43 శాతం, కోల్ ఇండియా 1.32 శాతం, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్స్ 1.32 శాతం లాభపడ్డాయి. టాప్ లూజర్స్ జాబితాలో నెస్లె 2.60 శాతం, దివిస్ ల్యాబ్స్ 2.40 శాతం, విప్రో 1.79 శాతం, ఎన్టీపీసీ 1.55 శాతం, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ 1.51 శాతం నష్టపోయాయి.