ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకి.. స్టాక్ మార్కెట్లో భారీ ప్రాఫిట్ బుకింగ్
స్టాక్ మార్కెట్లు సోమవారం (సెప్టెంబర్ 27) ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన సూచీలు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. మధ్యాహ్నం కాసేపు నష్టాల్లోకి వెళ్లి, ఆ తర్వాత లాభాల్లోకి వచ్చాయి. రోజంతా ఊగిసలాటలో కనిపించి చివరకు దాదాపు స్థిరంగా ముగిశాయి. సెన్సెక్స్ 60,303.79 పాయింట్ల వద్ద ప్రారంభమై, 60,412.32 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 59,887.19 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,932.20 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,943.50 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,802.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 29.41 (0.049%) పాయింట్లు లాభపడి 60,077.88 పాయింట్ల వద్ద, నిఫ్టీ 1.90 (0.011%) పాయింట్లు ఎగిసి 17,855.10 పాయింట్ల వద్ద ముగిసింది.
క్రూడాయిల్ ధరలు పెరిగాయి
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. క్రూడాయిల్ ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణ భయాలు అలుముకొని సూచీలు అప్రమత్తంగా కదలాడాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 70 డాలర్లకు పైగా, బ్రెంట్ క్రూడ్ ధర 75 డాలర్లను తాకింది. ఐరోపా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి వ్యాల్యూ రూ.73.83 వద్ద ముగిసింది. క్రితం సెషన్తో పోలిస్తే పదిహేను పైసలు తగ్గింది. 15 నిఫ్టీ స్టాక్స్ నష్టపోగా, 15 నిఫ్టీ స్టాక్స్ లాభపడ్డాయి. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ స్టాక్స్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. హెచ్సీఎల్ టెక్, దివిస్ ల్యాబ్స్, విప్రో, టెక్ మహీంద్రా టాప్ లూజర్స్గా నిలిచాయి.
ప్రాఫిట్ బుకింగ్ ఎఫెక్ట్
సెన్సెక్స్ నేడు 60,000 పాయింట్లకు పైనే ముగిసింది. నిప్టీ 17,900 డాలర్ల దిగువన ముగిసింది. సెప్టెంబర్ త్రైమాసికానికి గాను కాపెక్స్ గ్రోత్ డేటా, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా పైన అందరి చూపులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు అప్రమత్తంగా కదులుతున్నాయి. యూఎస్, యూకే కూడా ఈ వారం తమ అధికారిక జీడీపీ లెక్కలను విడుదల చేయనున్నాయి. అందుకే అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ ప్రభావం కూడా మన మార్కెట్ల పైన పడింది.
దీనికి తోడు గతవారం స్టాక్ మార్కెట్లు పరుగులు తీశాయి. చివరి సెషన్లో ప్రాఫిట్ బుకింగ్ ఉంటుందని భావించినప్పటికీ అప్పుడు కూడా లాభాల్లోనే ముగిసింది. దీంతో నేడు ప్రారంభంలో లాభపడినప్పటికీ, ఆ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా సూచీలు కిందకు దిగి వచ్చాయి. ప్రధానంగా ఐటీ, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్స్లో ఎక్కువగా కనిపించింది. ఆటో స్టాక్స్ కూడా రికవరీ బాటలో ఉన్నాయి. ఫైనాన్షియల్స్, రియాల్టీ సూచీలు నేడు లాభపడ్డాయి.
ఐటీ స్టాక్ డౌన్
రంగాలవారీగా చూస్తే ప్రాఫిట్ బుకింగ్ కారణంగా నిఫ్టీ ఐటీ 2.8 శాతం మేర క్షీణించింది. సెప్టెంబర్ క్వార్టర్ ఎర్నింగ్స్కు ముందు ప్రాఫిట్ బుక్ చేశారు. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో ఇండెక్స్ టాప్ గెయినర్గా ఉంది. శుక్రవారం నాటి క్లోజింగ్తో పోలిస్తే నేడు 3 శాతానికి పైగా లాభపడింది. గత రెండు నెలలుగా ఆటో స్టాక్స్ ఆశాజనకంగా లేవు. కానీ ఇప్పుడు పరుగులు తీశాయి. అక్టోబర్ నెలలో పండుగ సీజన్ నేపథ్యంలో సేల్స్ పుంజుకుంటాయనే అంచనాల నేపథ్యంలో ఆటో స్టాక్స్ లాభపడ్డాయి.