కొత్త రికార్డ్: ఆరంభంలో ప్రాఫిట్ బుకింగ్, చివరి గంటలో జంప్, ఆ స్టాక్ 2 సెషన్లలోనే అదరగొట్టింది
ముంబై: భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు పుంజుకొని, మంచి లాభాల్లో ముగిశాయి. బుధవారం ఉదయం (నవంబర్ 18) వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమై, మధ్యాహ్నం ఒకటి, ఒకటిన్నర వరకు ఊగిసలాటల్లో కనిపించింది. మధ్యలో ఓసారి లాభాల్లోకి వచ్చినప్పటికీ దాదాపు రెండు గంటల వరకు నష్టాల్లోనే ట్రేడ్ అయింది. అయితే చివరి గంటలో పుంజుకున్న సెన్సెక్స్... ఆ తర్వాత అంతకంతకూ పైకి ఎగిసింది. చివరకు 200 పాయింట్లకు పైగా లాభంతో ముగిసింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఫార్మా రంగాలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి.
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంటోంది: మూడీస్ తర్వాత గోల్డ్మన్ శాక్స్ అంచనా
సెన్సెక్స్ సరికొత్త రికార్డులు
సెన్సెక్స్ 227.34 పాయింట్లు(0.52%) లాభపడి 44,180.05 వద్ద, నిఫ్టీ 64.10 పాయింట్లు(0.50%) ఎగిసి 12,938.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1496 షేర్లు లాభాల్లో, 1100 షేర్లు నష్టాల్లో ముగిశాయి. 153 షేర్లలో ఎలాంటి మార్పులేదు.
ఉదయం నష్టాల్లో ప్రారంభమైన రూపాయి మధ్యాహ్నం 23 పైసలు ఎగబాకి 74.23 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం 74.49 వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ 44,180 వద్ద క్లోజ్ అయి జీవన గరిష్టం వద్ద ముగిసింది. నిఫ్టీ 12,938 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 9.81 శాతం, లార్సన్ 6.22 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 5.76 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 5.63 శాతం లాభాల్లో ముగిశాయి.
టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్ 2.94 శాతం, HUL 2.09 శాతం, ITC 1.76 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.68 శాతం, టైటాన్ కంపెనీ 1.68 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్ర ఉన్నాయి.
రెండు సెషన్లలో భారీగా జంప్
నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు 0.3 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు 1.4 శాతం లాభపడ్డాయి. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ సర్వీసెస్ 12 శాతం లాభపడింది. ఈ కంపెనీ బైబ్యాక్ ప్లాన్ వార్తల నేపథ్యంలో స్టాక్ ఎగిసింది. కేవలం రెండు సెషన్లలో 35 శాతానికి పైగా ఎగిసింది. క్రితం సెషన్లో 23 శాతం లభపడింది.
రంగాలవారీగా నిఫ్టీ ఆటో 3.10 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.95 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.36 శాతం, నిఫ్టీ మీడియా 0.54 శాతం, నిఫ్టీ మెటల్ 0.40 శాతం, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 3.57 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.05 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.96 శాతం లభపడ్డాయి.
నిఫ్టీ ఎనర్జీ 0.09 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.08 శాతం, నిఫ్టీ ఐటీ 0.81 శాతం, నిఫ్టీ ఫార్మా 0.67 శాతం నష్టపోయాయి.
ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్లు ఎగిశాయి.
అదానీ గ్యాస్ 16 శాతం, స్పెస్ జెట్ 13 శాతం లాభపడ్డాయి.
ప్రారంభంలో ప్రాఫిట్ బుకింగ్
ఆసియా మార్కెట్లలో సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల అండతో బుధవారం మార్కెట్లు లాభపడ్డాయి. ఆటోమొబైల్, ఆర్థిక రంగాల్లో కొనుగోళ్ల అండ కలిసి వచ్చింది. ప్రారంభంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి వెళ్లాయి. ఆ తర్వాత కీలక రంగాల్లో కొనుగోళ్లు లాభాల్లోకి వచ్చేలా చేశాయి.
ఐటీ రంగం విషయానికి వస్తే టీసీఎస్ 1.50 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.12 శాతం, ఇన్ఫోసిస్ 1.11 శాతం, టెక్ మహీంద్ర 1.24 శాతం, విప్రో 0.92 శాతం, మైండ్ ట్రీ 0.77 శాతం నష్టపోయాయి. అయితే కోఫోర్జ్ స్టాక్ మాత్రం 0.66 శాతం లాభపడింది.