భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, మళ్లీ ఆల్ టైమ్ గరిష్టానికి...
ముంబై: స్టాక్ మార్కెట్లో లాభాల పరంపర కొనసాగుతోంది. HCL టెక్, ఇన్ఫోసిస్, రిలయన్స్, టెక్ మహీంద్రా తదితర షేర్లు భారీగా రాణించడంతో సెన్సెక్స్ సరికొత్త గరిష్టాలను తాకింది. నిఫ్టీ కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. రూపాయి బలపడటం, FIIల కొనుగోళ్లు, వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగమందుకోవడం, కరోనా ఆంక్షల సడలింపు, బలమైన ఆర్థిక వ్యవస్థ గణాంకాలు, కీలక రంగాల రాణింపు వంటి అంశాలు సూచీల పరుగుకు అండగా నిలబడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.12 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఉదయం 58,411.62 పాయింట్ల వద్ద ప్రారంభమై, 58,515.85 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,200.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,399.35 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,429.55 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,345.55 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 166.96 (0.29%) పాయింట్లు లాభపడి 58,296.91 పాయింట్ల వద్ద, నిఫ్టీ 54.20 (0.31%) పాయింట్లు ఎగిసి 17,377.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్ 30 షేర్లలో 13 స్టాక్స్ లాభపడ్డాయి. HCL టెక్ 2.67 శాతం, ఇన్ఫోసిస్ 1.78 శాతం, రిలయన్స్ 1.62 శాతం, టెక్ మహీంద్రా 0.93 శాతం, బజాజ్ ఆటో 0.74 శాతం లాభపడ్డాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 1.13 శాతం, కొటాక్ మహీంద్రా బ్యాంక్ 0.86 శాతం, ఐటీసీ 0.66 శాతం, HDFC బ్యాంక్ 0.64 శాతం నష్టపోయాయి. నేటి టాప్ గెయినర్స్ జాబితాలో విప్రో 4.79 శాతం, HCL టెక్ 2.16 శాతం, ఇన్ఫోసిస్ 1.75 శాతం, హిండాల్కో 1.72 శాతం, రిలయన్స్ 1.55 శాతం లాభపడ్డాయి. ఐవోసీ 1.33 శాతం, ఓఎన్జీసీ 1.18 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 1.18 శాతం, బ్రిటానియా 1.09 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంకు 0.97 శాతం నష్టపోయాయి. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో రిలయన్స్, టాటా స్టీల్, విప్రో, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.
మార్కెట్ తన సానుకూల ధోరణిని కొనసాగించిందని, ఇతర ప్రపంచ మార్కెట్లు అప్రమత్తంగా కదలాడుతున్నాయని, నిఫ్టీ ఇప్పటికీ అధిగ దిగువ నిర్మాణాన్ని కొనసాగిస్తోందని, ఇది విస్తృతంగా సానుకూలంగా ఉందని, ఏదేమైనా మార్కెట్ సానుకూలంగా ఉన్న నేపథ్యంలో 17330 మద్దతు స్థాయిగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఇండెక్స్ 17330 వద్ద ట్రేడ్ అవుతున్నంత వరకు అప్ ట్రెండ్ 17450-17500 స్థాయిలో ఉండవచ్చునని, 17,330 పాయింట్ల దిగువకు పడిపోతే మాత్రం 17250-17210 స్థాయికి పడిపోయే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
ఇండెక్స్ ఇటీవల మంచి లాభాలతో ప్రారంభమవుతోందని చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు, ఐటీ, రియాల్టీ స్టాక్స్ నుండి బలమైన మద్దతు డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా ఉందని చెబుతున్నారు. అమెరికాలో బలమైన జాబ్ డేటా, జపాన్, చైనాలలో మరింత ఉద్దీపన, ఫెడ్ రిజర్వ్ ద్వారా ఆర్థిక మద్దతు కొనసాగుతుందనే ఆశలు ప్రపంచ మార్కెట్లను పెంచాయి. నేడు నిఫ్టీ ఐటీ, మీడియా సూచీలు 1.3 శాతం కంటే పైన లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు మాత్రం నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ రియాల్టీ స్టాక్స్ మాత్రం ఎప్పటికప్పుడు రికార్డ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇటీవల ఏకంగా 16 శాతం లాభపడింది.