సెన్సెక్స్ సూపర్ ఫాస్ట్ 10,000: ఈ నాలిగింటిది కీలక పాత్ర, ఇవి కలిసొచ్చాయి
బెంచ్మార్క్ బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 50,000 పాయింట్ల నుండి 60,000 పాయింట్లకు చేరుకోవడానికి 167 సెషన్లు తీసుకుంది. సెన్సెక్స్ 10,000 పాయింట్ల మేర ముందుకు కదలడంలో కనిష్ట సమయం ఇదే. అంతకుముందు 10,000 పాయింట్లు కదలడానికి సగటున 931 సెషన్స్ తీసుకున్నది. కరోనా వైరస్ కారణంగా మార్చి 2020లో భారీ క్రాష్ అనంతరం సూచీలు అప్పుడప్పుడు కిందకు పడిపోతున్నప్పటికీ, మళ్లీ పరుగు పెడుతోంది. మార్చి 2020 కనిష్ట పతనం నుండి సెన్సెక్స్ ఇప్పటి వరకు ఏకంగా 135 శాతం జంప్ చేసింది.
గ్లోబల్ లిక్విడిటీ సునామీ, ఊహించిన దాని కంటే వేగంగా రికవరీ వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను ప్రభావితం చేశాయి. దీంతో అతి తక్కువ కాలంలో సెన్సెక్స్ పదివేల పాయింట్ల మేర లబ్ధి పొందింది. మార్కెట్ పరుగుకు చాలా కారణాలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ వేగవంతం నేపథ్యంలో థర్డ్ వేవ్ భయాలు తగ్గాయి.
సెన్సెక్స్ ఇలా...
సెన్సెక్స్ 10,000 పాయింట్ల నుండి 20,000 పాయింట్లకు చేరుకోవడానికి 433 సెషన్స్ తీసుకున్నది.
20,000 పాయింట్ల నుండి 30,000 పాయింట్లను చేరుకోవడానికి 1823 సెషన్స్ తీసుకుంది.
30,000 పాయింట్ల నుండి 40,000 పాయింట్లను చేరుకోవడానికి 1045 సెషన్స్ అవసరమైంది.
40,0000 పాయింట్ల నుండి 50,000 పాయింట్లను చేరుకోవడానికి 423 సెషన్లు కావాల్సి వచ్చింది.
50,000 పాయింట్ల నుండి 60,000 పాయింట్లను చేరుకోవడానికి మాత్రం కేవలం 167 సెషన్స్ పట్టింది.

సెన్సెక్స్ కీలక పాయింట్లు ఎప్పుడు క్రాస్ చేసిందంటే...
- సెన్సెక్స్ 1,000 - 07-25-1990
- సెన్సెక్స్ 5,000 - 11-10-1999
- సెన్సెక్స్ 10,000 - 07-02-2006
- సెన్సెక్స్ 15,000 - 09-17-2007
- సెన్సెక్స్ 20,000 - 11-12-2007
- సెన్సెక్స్ 25,000 - 05-06-2014
- సెన్సెక్స్ 30,000 - 26-04-2017
- సెన్సెక్స్ 35,000 - 17-01-2018
- సెన్సెక్స్ 40,000 - 03-06-2019
- సెన్సెక్స్ 45,000 - 04-12-2020
- సెన్సెక్స్ 50,000 - 03-02-2021
- సెన్సెక్స్ 55,000 - 13-08-2021
- సెన్సెక్స్ 60,000 - 24-09-2021
సెన్సెక్స్లో ఈ స్టాక్స్ పాత్ర ఎక్కువ
సెన్సెక్స్ 50,000 నుండి ఈ స్థాయికి పరుగు పెట్టడంలో దాదాపు 20 శాతం పాత్ర నాలుగు కంపెనీలదే ఉంది. వీటిలోను ఇన్ఫోసిస్ పాత్ర 30 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 19 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 30 శాతం, భారతీ ఎయిర్టెల్ 25 శాతంగా ఉంది.
50వేల పాయింట్ల నుండి 60వేల పాయింట్ల జర్నీలో అత్యధికంగా లాభపడిన స్టాక్స్లో బజాజ్ ఫిన్ సర్వ్ 105 శాతం, టాటా స్టీల్ 98 శాతం, బజాజ్ ఫైనాన్స్ 54 శాతం, ఎస్బీఐ 53 శాతం, టెక్ మహీంద్రా 52 శాతం, టైటాన్ కంపెనీ 39 శాతం, అల్ట్రా టెక్ సిమెంట్ 37 శాతం, హెచ్సీఎల్ టెక్ 34 శాతం, సన్ ఫార్మాస్యూటికల్స్ 32 శాతం, ఎన్టీపీసీ 31 శాతంగా ఉంది.
అందుకే మార్కెట్లు జంప్
కరోనా అనంతరం రిటైల్ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లో పెరిగాయి. ఇవి సూచీల పరుగుకు మరో కారణం. కొత్తతరం స్టాక్ మార్కెట్లోకి అడుగు పెట్టడం, తక్కువ వయస్సులోనే యువకులు ఇన్వెస్టర్ల వైపు మళ్లడం మార్కెట్ జోరుకు ఊతమిచ్చింది. సాధారణంగా యువత రిస్క్ తీసుకోవడంలో ముందు ఉంటుంది. మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొన్నేళ్లుగా కొన్ని కోట్ల డీమ్యాట్ అకౌంట్స్ తెరుచుకుంటున్నాయి.
మార్కెట్లోకి గత ఏడాదిగా ఐపీవోలు జోరుగా వస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు నలభై కంపెనీలు ఐపీవోకు వచ్చాయి. రూ.70వేల కోట్లకు పైగా సమీకరించాయని అంచనా. మున్ముందు పేటీం, ఓయో వంటి పెద్ద ఐపీవోలు రానున్నాయి. కొత్త తరం పెట్టుబడి ప్రణాళికాలను ఐపీవోలు సొమ్ము చేసుకునే దిశగా వస్తున్నాయి. అలాగే, అతంర్జాతీయంగా టెక్నాలజీ పరంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇది వ్యాపార విస్తరణకు మరిన్ని అవకాశాలు కల్పిస్తోంది. దీంతో కంపెనీలు ఐపీవోకు వస్తున్నాయి.
కరోనా తర్వాత డిజిటలైజేషన్ నేపథ్యంలో ఐటీ జంప్ చేస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. డిజిటల్ టెక్నాలజీ అవకాశాలు విస్తృతంగా పెరగడంతో ఈ రంగంలో ఉద్యోగాలు, వ్యాపారాలు పెరుగుతున్నాయి.
మరోవైపు, ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగులు, చిన్న సంస్థల నుండి పెద్ద కంపెనీల వరకు ఊరటనిచ్చేలా కేంద్రం ముందుకు వచ్చింది. పీఎల్ఐ పేరిట దేశఈయంగా ఉత్పత్తిని ప్రోత్సహించింది. బ్యాంకుల విలీనం, ప్రయివేటీకరణ, ఆర్బీఐ సర్దుబాటు వైఖరి, టెలికంకు ప్రత్యేక రాయితీలు వంటి అంశాలు మార్కెట్లో విశ్వాసాన్ని పెంచాయి. దీనికి తోడు సానుకూల రుతుపవనాలు కలిసి వచ్చాయి.

ఇటీవలి పరిణామాలు
ఇటీవలి పరిణామాలు కూడా మార్కెట్కు ఊతమిచ్చాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బాండ్స్ తగ్గింపు ప్రకటన, చైనాకు చెందిన ఎవర్ గ్రాండ్ సంక్షోభ పరిష్కారం వంటి అంశాలు మొదట ఆందోళన కలిగించినా తర్వాత ఊతమిచ్చాయి. మోడీ అమెరికాలో పెద్ద పెద్ద సంస్థల సీఈవోలను కలవడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. కీలక రేటింగ్ ఏజెన్సీలు భారత్ రేటింగ్ను అప్ గ్రేడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే, పలు సంస్థలు ఆర్థిక రికవరీ వేగంగా కనిపిస్తోందని, జీడీపీ వృద్ధి రేటు అంచనాలను మరింత సానుకూలంగా సవరిస్తుండటం కలిసి వస్తోంది.


Click it and Unblock the Notifications