అమెరికా మార్కెట్ అదుర్స్, సెన్సెక్స్ 270 పాయింట్లు జంప్
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు (ఏప్రిల్ 29, శుక్రవారం) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో సూచీలు కాస్త పుంజుకున్నాయి. అంతకుముందు నష్టపోయిన సూచీలు, నిన్న భారీగా ఎగిసిపడ్డాయి. సెన్సెక్స్ ఏకంగా 700 పాయింట్లు లాభపడింది. నేడు అదే దూకుడును కొనసాగిస్తోంది. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్భణం, కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్లు చైనా కరోనా లాక్ డౌన్ వంటి అంశాలు ఇటీవల సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఈ వారం మార్కెట్లు తీవ్ర ఊగిసలాటలో కొనసాగాయి. చివరలో మాత్రం లాభాల్లోకి వచ్చాయి.
గురువారం అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా బలమైన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఆపిల్, అమెజాన్ ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి. అయినప్పటికీ మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. అమెరికా మార్కెట్ నుండి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు స్వల్పంగా పెరిగాయి.
దేశీయంగా దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లో ఉన్నాయి. ఆటో, హెల్త్ కేర్, మెటల్, రియాల్టీ స్టాక్స్ కొనుగోళ్ల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. నేడు ఉదయం సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో HDFC లైఫ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్, టాటా కన్స్యూమర్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఉన్నాయి. ఉదయం గం.10.40 సమయానికి సెన్సెక్స్ 274 పాయింట్లు లాభపడి 57,794 పాయింట్ల వద్ద, నిఫ్టీ 35 పాయింట్లు ఎగిసి 17,280 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.