59,000 పాయింట్ల కిందకు పడిపోయిన సెన్సెక్స్, నష్టాల్లో మార్కెట్ క్లోజ్
ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (సెప్టెంబర్ 22) నష్టాల్లో ముగిశాయి. నేడు ఆద్యంతం ఊగిసలాటలో కనిపించిన సూచీలు తొలి గంటలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత కాసేపు లాభాల్లో కనిపించినప్పటికీ ఎంతసేపు నిలవలేదు. దీంతో సూచీలు రోజంతా ఒడిదుడుకులతో సాగాయి. చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్ గ్రాండ్ సంక్షోభంపై చైనాప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో కంపెనీ మాత్రం ఈ సంక్షోభం నుండి గట్టెక్కుతామని ధీమాను వ్యక్తం చేసింది. ఇందుకు అనుగుణంగా బాండ్స్ ప్రణాళికను ముందుకు తెచ్చింది. దీంతో ఆసియా మార్కెట్లు అప్రమత్తంగా కదలాడాయి. ఆ ప్రభావం దేశీయ సూచీలపై పడింది. ఐరోపా మార్కెట్లు కూడా మందకోడిగా ఉన్నాయి. దీంతో సూచీలకు ఎలాంటి మద్దతు లభించలేదు. డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 73.87 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 59,166.15 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,178.44 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 58,878.38 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 17,580.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,610.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,524.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 77.94 (0.13%) పాయింట్లు నష్టపోయి 58,927.33 పాయింట్ల వద్ద, 15.35 (0.087%) పాయింట్లు క్షీణించి 17,546.65 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 షేర్లలో 16 లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, HCL టెక్, బజాజ్ ఆటో, రిలయన్స్, టాటా స్టీల్, ఐటీసీ, సన్ ఫార్మా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. HDFC, నెస్ట్లే, ఐసీఐసీఐ బ్యాంక్, HUL, కొటక్ మహీంద్రా బ్యాంక్, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టపోయాయి.
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా మధ్య విలీన ఒప్పందం కుదిరింది. దీంతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఈ ఒక్కరోజే కంపెనీ షేర్ వ్యాల్యూ దాదాపు 31 శాతం లాభపడింది. క్రితం సెషన్లో రూ.255 వద్ద ముగిసిన స్టాక్ నేడు రూ.333ను క్రాస్ చేసింది. ఇక రియాల్టీ సూచీలు 8 శాతం జంప్ చేశాయి. టాప్ గెయినర్స్ జాబితాలో కోల్ ఇండియా 3.64 శాతం, టెక్ మహీంద్రా 3.55 శాతం, టాటా మోటార్స్ 2.70 శాతం, హిండాల్కో 2.66 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.90 శాతం లాభపడ్డాయి.