భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్: ఎల్ఐసీ ఐపీవోకు స్పందన
నిన్న భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ట్రేడ్ ప్రారంభమయ్యాయి. ఆటో, బ్యాంకింగ్, ఐటీ, మెటల్ స్టాక్స్ అదరగొడుతున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ 16800 పాయింట్ల పైకి చేరుకుంది. సెన్సెక్స్ ఉదయం గం.10 సమయానికి 743 పాయింట్లు లేదా 1.34శాతం లాభపడి 56,424 పాయింట్ల వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు ఎగిసి 16,892 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.
దాదాపు అన్ని రంగాలు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, ఐటీ, మెటల్, క్యాపిడల్ గూడ్స్, పవర్ సూచీలు ఒక శాతానికి పైగా లాభాల్లో ఉన్నాయి. క్రితం సెషన్లో సెన్సెక్స్ 55,000 పాయింట్ల దిగువకు పడిపోయినప్పటికీ, నేడు మాత్రం 56,500 పాయింట్ల సమీపానికి చేరుకుంది. అమెరికా మార్కెట్లు నిన్న భారీ లాభాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500 సూచీ రెండేళ్లలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది.
ఇదిలా ఉండగా, ఎల్ఐసీ ఐపీవోకు భారీ స్పందన వచ్చింది. ఈ ఇష్యూకు తొలి రోజు 67 శాతం స్పందన లభించింది. అయితే పాలసీదారుల విభాగంలో మాత్రం 1.9 శాతం దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగుల విభాగంలో పూర్తిస్థాయిలో స్పందన లభించింది. చిన్న ఇన్వెస్టర్ల విభాగంలో 60 శాతం, అర్హులైన సంస్థాగత ఇన్వ ెస్టర్ల విభాగంలో 33 శాతం, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 27 శాతం స్పందన లభించింది.