సెన్సెక్స్ 383 పాయింట్లు జంప్, ఈ స్టాక్స్ 15 శాతం జంప్
వరుసగా నాలుగు సెషన్లు నష్టపోయిన స్టాక్ మార్కెట్లు ఈవారం లాభాల్లోకి వచ్చాయి. నిన్న 145 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ నేడు మరింత దూకుడుతో 383 పాయింట్లు ఎగబాకింది. దీంతో సెన్సెక్స్ మళ్లీ 61,000 మార్కును క్రాస్ చేసి ముగిసింది. మధ్యాహ్నం కాసేపు నష్టాల్లోకి వెళ్లినప్పటికీ, తిరిగి పుంజుకుంది. ఆటో, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, సూచీలు ఒక శాతం నుండి మూడు శాతం మేర ఎగిశాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు 1.5 శాతం చొప్పున లాభపడ్డాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, కొటక్ మహీంద్రా బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ అదరగొట్టాయి. ఇక సుగర్ స్టాక్స్ ఎనిమిది శాతం మేర లాభపడ్డాయి. ద్వారికేష్ షుగర్ మిడ్ క్యాప్ సూచీ 1.7 శాతం, స్మాల్ క్యాప్ 2 శాతం మేర లాభపడింది.
సెన్సెక్స్ జంప్
సెన్సెక్స్ నేడు ఉదయం 60,997.90 పాయింట్ల వద్ద ప్రారంభమై, 61,497.71 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 60,791.29 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో సెన్సెక్స్ 60,967.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 18,154.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 18,310.45 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 18,099.30 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్లో 18,125.40 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. సెన్సెక్స్ చివరకు 383.21 (0.63%) పాయింట్లు లాభపడి 61,350.26 పాయింట్ల వద్ద, నిఫ్టీ 143.00 (0.79%) పాయింట్లు ఎగిసి 18,268.40 పాయింట్ల వద్ద ముగిసింది.
టాప్ లూజర్స్, గెయినర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో టాటా మోటార్స్ 5.99 శాతం, టాటా స్టీల్ 3.89 శాతం, SBI లైఫ్ ఇన్సురెన్స్ 3.75 శాతం, టైటాన్ కంపెనీ 3.18 శాతం, JSW స్టీల్ 2.98 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 1.94 శాతం,
ICICI బ్యాంకు 1.46 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 1.17 శాతం, HUL 0.77 శాతం, NTPC 0.49 శాతం నష్టపోయాయి.
భారీ లాభాల్లో ఈ స్టాక్స్
నిన్న, నేడు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అయితే కొన్ని స్టాక్స్ అదరగొట్టే ర్యాలీ చేశాయి. 15 శాతానికి పైగా ఎగిసిన స్టాక్స్ ఉన్నాయి. అందులో భారత్ అగ్రి ఫెర్ట్ (20.0%), ఒలింపియా ఇండ్(19.97%), ప్రీతిష్ నందీ(19.95%), విలియమ్సన్ మాగోర్ (19.85%), KEI ఇండస్ట్రీస్ (19.17%), జిందాల్ స్టెయిన్లెస్(16.3%) భారీగా లాభపడ్డాయి.