నష్టాలకు బ్రేక్, సెన్సెక్స్ 209 పాయింట్లు జంప్, నిఫ్టీ 15,750 పాయింట్ల పైకి
స్టాక్ మార్కెట్ నష్టాలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో పాటు దేశీయ ఐటీ, మెటల్, ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరిగి లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా, నిఫ్టీ దాదాపు 70 పాయింట్లు లాభపడింది. కొనుగోళ్ల అండతో ఉదయం సూచీలు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సూచీలు ఏ దశలోను పడిపోలేదు. పైగా అంతకంతకూ ఎగిసింది.
సెన్సెక్స్ నేడు 52,693.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,777.18 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 52,561.39 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 15,762.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 15,817.35 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 15,737.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ చివరకు 209.36 (0.40%) పాయింట్లు ఎగిసి 52,653.07 పాయింట్ల వద్ద, నిఫ్టీ +69.05 (0.44%) పాయింట్లు లాభపడి 15,778.45 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో టాటా స్టీల్, హిండాల్కో, టాటా మోటార్స్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యు స్టీల్ ఉన్నాయి. టాప్ గెయినర్స్ జాబితాలో హిండాల్కో, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యు స్టీల్ ఉన్నాయి. టాప్ లూజర్స్ జాబితాలో మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పోరేషన్, ఐటీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా ఉన్నాయి.