భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు, ఈ స్టాక్స్ మాత్రం 10% పైగా జంప్
స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి 3, 2022) భారీ నష్టాల్లో ముగిశాయి. వరుసగా మూడు రోజుల పాటు పరుగులు పెట్టిన సూచీలు బడ్జెట్ తర్వాత రెండో రోజు కుంగిపోయాయి. దాదాపు బడ్జెట్ రోజు లాభపడినంతగా సూచీలు నేడు పతనమయ్యాయి. బడ్జెట్కు ముందు, తర్వాత వరుసగా సూచీలు భారీగా లాభపడ్డాయి. గత నాలుగైదు సెషన్లలోనే సెన్సెక్స్ 57,000 స్థాయి నుండి 59,000 క్రాస్ చేసింది. అంటే దాదాపు 2000 పాయింట్ల మేర లాభపడింది. వేగంగా ఎగిసిపడటంతో ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. దీనికి అంతర్జాతీయ మార్కెట్ తోడైంది. దీంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
ఈ స్టాక్స్ జంప్
నేడు సూచీలు భారీగా నష్టపోయాయి. అయితే పలు స్టాక్స్ మాత్రం పది శాతం కంటే ఎక్కువగా లాభపడ్డాయి. అలాంటి స్టాక్స్లో ధనీ ఇడ్బుల్ వెంచర్స్(14.56%), భాగ్యనగర్ ఇండ్ (13.3%), నల్వ సన్స్ ఇన్వెస్ట్(13.19%), శివాలిక్ బిమెటల్(10.95%), అంబికా కాటన్(10.81%), HT మీడియా (10.75%), ఇషాన్ డైస్ కెమ్ (10.03%), జువారీ ఆగ్రో కెమ్ (10.0%) ఉన్నాయి.
నష్టాల్లో ప్రారంభమై...
సెన్సెక్స్ నేడు ఉదయం 59,528.16 పాయింట్ల వద్ద ప్రారంభమై, 59,557.87 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 58,653.94 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకాయి. సెన్సెక్స్ చివరకు 794 పాయింట్లు లేదా 1.37 శాతం నష్టపోయి 58,788 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 17,767.75 పాయింట్ల వద్ద ప్రారంభమై, 17,781.15 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 17,511.15 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ చివరకు 219.80 పాయింట్లు లేదా 1.24 శాతం క్షీణించి 17,560.20 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఆద్యంతం నష్టాల్లోనే ఉన్నాయి. ప్రతి గంటకు నష్టాలు పెరిగాయి తప్ప లాభపడలేదు.
ఐటీ, రియాల్టీ దెబ్బ
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, దివిస్ ల్యాబ్స్, ఐటీసీ, మారుతీ సుజుకీ ఉన్నాయి. నేటి టాప్ లూజర్స్ జాబితాలో HDFC, NTPC, SBI లైఫ్ ఇన్సురెన్స్, ఇన్ఫోసిస్, గ్రాసీమ్ ఉన్నాయి. ఆటో రంగం మినహా మిగతా రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా ఐటీ, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు ఒక శాతం నుండి రెండు శాతం మేర నష్టపోయాయి.