ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ గరిష్టం నుండి 400 పాయింట్లు డౌన్
స్టాక్ మార్కెట్లు బుధవారం (జూన్ 1) ఊగిసలాటలో ఉన్నాయి. నిన్న భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు నేడు కూడా అదే ధోరణితో కొనసాగుతున్నాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూఎస్ ఫ్యూచర్స్ నేడు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. దీంతో ఉదయం అతి స్వల్ప లాభాల్లో లేదా ఫ్లాట్గా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్లింది. మొత్తానికి సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాటలో ఉన్నాయి. ఆసియా సూచీలు కూడా ప్రతికూలంగానే కదులుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్భణ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీస్తోంది.
క్రితం సెషన్లో సెన్సెక్స్ 55,566 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 55,588 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,791 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 55,407 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 16,594 పాయింట్ల వద్ద ప్రారంభమై, 16,649 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 16,537 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.15 సమయానికి సెన్సెక్స్ 8 పాయింట్లు లాభపడి 55,574 పాయింట్ల వద్ద, నిఫ్టీ 2 పాయింట్లు ఎగిసి 16,586 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్ నేడు 400 పాయింట్ల పైకి, కిందకు కదలాడింది.
సర్టిఫైయింగ్ అథారిటీ కంపెనీ ఈ-ముద్ర షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్చేంజీలో నమోదవుతున్నాయి. ఐపీవోలో ఈ కంపెనీ షేర్లకు 2.7 రెట్ల స్పందన లభించింది. రష్యాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్ మార్క్ మార్చి త్రైమాసికంలో రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీంతో ఫార్మా స్టాక్స్ సానుకూలంగానే ఉంటాయని అంచనా. ఎల్ఐసీ షేర్ నేడు స్వల్పంగా లాభపడి రూ.812 వద్ద ట్రేడ్ అవుతోంది.