1000 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్, 16,000 పాయింట్ల దిగువకు నిఫ్టీ
భారత స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. వరుస రెండు రోజుల లాభాల అనంతరం, నిన్న మార్కెట్లు నష్టపోయాయి. నేడు (గురువారం, మే 19) భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా క్షీణించింది. ఉదయం సెన్సెక్స్ 53,070 పాయింట్ల వద్ద ప్రారంభమై, 53,356 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 53,053 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 968 పాయింట్లు నష్టపోయి 53,240 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 292 పాయింట్లు క్షీణించి 15,948 పాయింట్ల వద్ద కదలాడింది. సెన్సెక్స్, నిఫ్టీలు 1.80 శాతం మేర క్షీణించాయి.
అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఆటో, బ్యాంకింగ్, రియాల్టీ, మెటల్, ఐటీ సూచీలు 1 శాతం నుండి 3 శాతం మేర క్షీణించాయి. అత్యధికంగా పవర్, యుటిలిటీ సూచీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి.సెన్సెక్స్ క్రితం సెషన్లో 54,208 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ఓ సమయంలో 53,000 స్థాయికి పడిపోయింది. ఈ మార్కు దిగువకు మాత్రం వెళ్లలేదు. కానీ ఆల్ టైమ్ గరిష్టం 62,245 పాయింట్లతో దాదాపు 9000 పాయింట్లు తక్కువగా ఉంది.
అమెరికా మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇది మన సూచీలపై ప్రభావం చూపింది. దీనికి తోడు మార్కెట్ తీరును అంచనా వేసే వీఐఎక్స్ సూచీ 9 శాతం పెరిగింది. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఐరోపా ఖండంలోని ఫైనాన్షియల్ హబ్ యూకేలో ద్రవ్యోల్భణం 40 ఏళ్ల గరిష్టానికి పెరిగింది. ఇది కూడా మార్కెట్ సెంటిమెంట్ పైన ప్రభావం చూపింది.